AP Politics: రాజకీయాల్లో కొందరు నేతలకు పార్టీ మారితే కలిసి వస్తుంది. పదవులు వరిస్తాయి. పార్టీలో పరపతీ ఉంటుంది. కానీ కొందరు నేతలు మాత్రం అనాలోచిత నిర్ణయాల కారణంగా పదవులకు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ మహిళా నేత రాజకీయాల్లోకి రావడం రావడం అత్యున్నత పార్లమెంట్ కు ఎన్నిక అయ్యే అవకాశం ఏర్పడింది. కానీ ఆ తరువాత వేసిన తప్పటడుగు ఆమెకు శాపం అయ్యింది. ఇప్పుడు మళ్లీ పాత గూటికి చేరాలని సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. విషయంలోకి వెళితే.. బుట్టా రేణుక 2014కు ముందు రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చీ రాగానే ఆమెకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆమెకు కర్నూలు పార్లమెంట్ సీటు ఇచ్చారు. దాదాపు 40వేల పైచిలుకు మెజార్టీతో ఆమె టీడీపీ అభ్యర్ధి బీటీ నాయుడుపై విజయం సాధించారు. దేశంలో ధనిక ఎంపీల్లో ఆమె ఒకరుగా ఉన్నారు. ఆమె ఆస్తుల విలువ రూ.300 కోట్లపైమాటే. అయితే ఆమె భర్త శివ నీలకంఠ మొదటి నుండి టీడీపీ సానుభూతిపరుడు. ముందుగానే నీలకంఠ టీడీపీ లో చేరారు.
2019 లో సీటు ఇవ్వకపోవడంతో..
రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆమె కూడా టీడీపీ మద్దతుదారుగా మారిపోయారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు కర్నూలు టికెట్ ను కోట్ల సూర్యప్రకాశరెడ్డికి కేటాయించడంతో బుట్టా రేణుక వైసీపీలో చేరిపోయారు. అయితే అప్పట్లో జగన్ పార్లమెంట్ టికెట్ ఇవ్వకపోయినా తరువాత ఎమ్మెల్సీ సీటు అయినా ఇస్తారేమోనని పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా ఆమెకు ఎలాంటి పదవులు దక్కలేదు. ఒక సారి పార్టీని మోసం చేసి వెళ్లి వచ్చిన వారికి జగన్ పదవులు ఇవ్వరు అని పార్టీలోని అగ్రనేత ఒకరు ఆమెకు చెప్పడంతో ఇక వైసీపీలో కొనసాగడం వల్ల ఉపయోగం లేదని భావిస్తున్నారుట. మున్సిపల్ ఎన్నికల వరకూ యాక్టివ్ గా పని చేసిన ఆమె.. ఆ తరువాత సైలెంట్ అయ్యారని అంటున్నారు. మరల టీడీపీలోకి వెళితే ఎంపీ లేదా ఎమ్మెల్యే సీటు దాదాపు కన్ఫర్మ్ అవుతుందన్న భావనలో ఉన్నారని సమాచారం.
సీటు కోసం టీడీపీతో లాబీయింగ్ ..?
ఇప్పటికే ఆమె భర్త టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారుట. ఈ సారి కర్నూలు ఎంపీ సీటును కోట్ల సూర్యప్రకాశరెడ్డికి ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధం లేరనీ, అదే విధంగా ఎమ్మిగనూరు అసెంబ్లీ స్థానానికి అభ్యర్ధిని మార్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినబడుతున్నాయి. దీంతో ఆమె తిరిగి టీడీపీలోకి రావాలని చూస్తున్నారని వార్తలు వినబడుతున్నాయి. కర్నూలు పార్లమెంట్ లేదా ఎమ్మిగనూరు అసెంబ్లీ సీటులో ఏదో ఒకటి హామీ ఇస్తే టీడీపీలో చేరడానికి సిద్ధమేనని అంటున్నారు. ఈ మేరకు ఇప్పటి నుండే ఆమె భర్త పార్టీ పెద్దలతో మంతనాలు సాగిస్తున్నారని వార్తలు వినబడుతున్నాయి. చూడాలి ఏమి జరుగుతుందో.