AP Politics : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శల దాడి కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికలకు గానూ టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు విడుదల చేశారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్మోహనరెడ్డి పాలనపై లోకేష్ విమర్శలు గుప్పించారు.
పబ్లిసిటీ పీక్..మ్యాటర్ వీక్
రాష్ట్రంలో వైసీపీ పాలన చూస్తుంటే పబ్లిసిటీ పీక్ ..మ్యాటర్ వీక్ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. దీనికి సన్న బియ్యమే ఒక ఉదాహరణగా పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు సన్నబియ్యం ఇస్తామని హామీ ఇచ్చిన జగన్మోహనరెడ్డి ఎన్నికల తరువాత నాణ్యమైన బియ్యం అంటూ మాట మార్చారన్నారు. తర్వాత వేల కోట్లు ఖర్చు చేసి వాహనాలు ఏర్పాటు చేసి విజయవాడలో ఆర్భాటంగా ప్రారంభించి స్పీడ్ గా గ్రామాలకు పంపితే గ్రామాల్లో ప్రజలు ఛీకొడితే మళ్లీ స్పీడ్ గా ఆ వాహనాలు తాడేపల్లి ప్యాలస్ కు వచ్చాయని లోకేష్ ఎద్దేవా చేశారు. అందుకే పబ్లిసిటీ పీక్ ..మ్యాటర్ వీక్ అనాల్సి వస్తోందన్నారు.
AP Politics : చంద్రబాబుకు కొత్తరకం మానసిక వ్యాధి
ఇదిలా ఉండగా టీడీపీ అధినేత చంద్రబాబును కుప్పం నియోజకవర్గంలో చేసిన వ్యాఖ్యలపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ…చంద్రబాబు అరుదైన మానసిక వ్యాధితో బాధపడుతున్నాడంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచినే నెవరికీ భయపడను, నన్నెవరూ భయపెట్టలేరంటూ గింజుకుంటున్నాడు. చంద్రబాబూ…నువ్వో చచ్చిన విషసర్పానివి. నిన్నెవరూ భయపెట్టడం లేదు. అరుదైన మానసిక వ్యాధితో బాధపడుతున్నావు. ఎన్నికల్లో చిత్తుగా ఓడించాక అది మరింత ముదిరింది” అంటూ విమర్శించారు విజయసాయిరెడ్డి.
“కుప్పం వెళ్లిన చంద్రబాబు… ఇది పుంగనూరు, కడప, పులివెందుల కాదు ఖబడ్దారన్నాడు. ఉత్తరాంధ్రకు వచ్చి ఇది రాయలసీమ కాదు మీ ఆటలు సాగవంటాడు. మంచివారు, చెడ్డవారు ప్రాంతాలవారీగా ఉంటారా బాబూ?” అని ప్రశ్నించారు. ప్రాంతాలు, కులాలు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడమే నీ పనా? నీవెక్కడికెళ్లినా పీకేదీమీ లేదని పేర్కొన్నారు.