AP Politics: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏపి పర్యటనకు వస్తున్నారు. ఏపిలో జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసీపీ సర్కార్ ఏర్పడిన తరువాత ప్రధాన మంత్రి మోడీ ఏపికి రావడం ఇది మూడవ సారి. ఒక సారి తిరుమల పర్యటనకు, ఆ తరువాత షార్ సందర్శనకు వచ్చారు. అధికారికంగా, రాజకీయంగా ఆనాడు ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనలేదు మోడీ. ఇప్పుడు జూలై నాల్గవ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడకల సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో పీఎం మోడీ పాల్గొంటారని సోము వీర్రాజు పేర్కొన్నారు. ఇది అధికారికంగా పాల్గొనే కార్యక్రమం అయినప్పటికీ ప్రధాని మోడీ రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశం అవుతారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ ఇంత వరకూ అధికారికంగా ఖరారు కాలేదు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
AP Politics: అక్కడ కెసిఆర్ ను విమర్శించారు మోడీ
అయితే ఇటీవల హైదరాబాద్ లో అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాన మంత్రి మోడీ విమానాశ్రయంలోనే బీజేపీ నేతలతో సమావేశం అయ్యారు. కేసిఆర్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో అధికారంలోకి రాబోయేది బీజేపీయేనంటూ మాట్లాడారు. అయితే అక్కడ సీఎం కేసిఆర్ కేంద్రంపై కాలు దువ్వుతూ విమర్శలు చేస్తుండటం, జాతీయ స్థాయిలో బీజేపీయేతర నేతలతో కూటమి ప్రయత్నాలను కేసిఆర్ చేస్తుండటం నేపథ్యంలో ప్రధాని మోడీ .. కేసిఆర్ కుటుంబ పాలనపై ధ్వజమెత్తారు. అయితే ఏపిలో పరిస్థితులు వేరు. ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కేంద్రంతో సన్నిహిత సంబంధాలను నెరపుతున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నా ఏపి సీఎం వైఎస్ జగన్ ఏనాడు బీజేపీని గానీ, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించిన దాఖలాలు లేవు. ఈ తరుణంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఏ విధమైన ప్రసంగం చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
వచ్చే నెలలో జేపీ నడ్డా పర్యటన
ప్రధాని మోడీ పర్యటనకు సుమారుగా నెల రోజుల ముందు అంటే జూన్ మొదటి వారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా ఏపి పర్యటనకు విచ్చేస్తున్నారు. జూన్ 7,8 తేదీల్లో జేపి నడ్డా ఏపిలో పర్యటించనున్నారు. 7వ తేదీన బీజేపీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. 8వ తేదీ విజయవాడలో పార్టీ సమావేశంలో పాల్గొని రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయనున్నారని సమాచారం. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో పొత్తుల వ్యవహారంపై జోరుగా చర్చ జరుగుతోంది. బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన వచ్చే ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తొంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ పరోక్షంగా టీడీపీతో పొత్తుకు సిగ్నల్ ఇచ్చేశారు. టీడీపీ కూడా జనసేనతో పొత్తునకు సుముఖంగా ఉన్నట్లు ప్రకటించేసింది. అయితే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం టీడీపీతో కలిసే ప్రసక్తి లేదంటూ పదేపదే చెబుతున్నారు. తమ పొత్తు జనసేనతోనే అని సోము వీర్రాజు స్పష్టం చేస్తున్నారు. అవసరం అయితే బీజేపీ పెద్దలతోనూ మాట్లాడతానని పవన్ కళ్యాణ్ అంటున్నారు.
AP Politics: ఆ ఎన్నికల వరకు సైలెన్స్
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీకి వైసీపీ సహకారం అవసరం. అందుకని పూర్తి స్థాయిలో వైసీపీని బీజేపీ పక్కన పెట్టే పరిస్థితి లేదు. ఈ తరుణంలో రాబోయే ఎన్నికలకు సంబంధించి పొత్తుల అంశంపై బీజేపీ అగ్రనేతలు ఎటువంటి స్టాండ్ తీసుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జేపి నడ్డా రాష్ట్రానికి విచ్చేసినా ఇప్పుడే ఈ విషయాన్ని తెల్చే అవకాశం లేదు. రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క స్థానం కూడా గెలుచుకునే అవకాశాలు లేవు. కేవలం బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లడానికి జనసేన సిద్ధంగా లేదు. రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా ఉన్న వైసీపీని అధికారంలోకి రాకుండా చేయాలంటే ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో కలిసి ప్రయాణం చేయాలన్న యోచనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు. సో…ఇప్పుడు రాష్ట్రానికి ప్రధాని మోడీ, అధ్యక్షుడు నడ్డా వచ్చినా పొత్తుల అంశంపై ఇప్పుడే మాట్లాడే అవకాశం లేదనీ, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల తరువాతనే ఒక నిర్ణయానికి బీజేపీ వస్తుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది.