AP Politics: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం హాట్ హాట్ గా నడుస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా గడువు రెండున్నర సంవత్సరాలు ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలు ఇప్పటి నుండి సన్నద్దం అవుతున్నాయి. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పథకాలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్న సీఎం వైఎస్ జగన్ రచ్చబండ పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. అభివృద్ధి విషయంలో వెనకబడ్డా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల కాన్సెప్ట్, 26 జిల్లాలతో పరిపాలన తమ గెలుపునకు బాట అవుతుందని వైసీీపీ శ్రేణులు భావిస్తున్నారు.
AP Politics: జనసేన, బీజేపీతో మరో సారి పొత్తుకు
మరో పక్క నెక్ట్స్ టైమ్ అధికారాన్ని ఎలాగైనా కైవశం చేసుకోవాలన్న తలంపుతో ప్రతిపక్ష టీడీపీ వ్యూహాలతో సిద్దం అవుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు పార్టీ బలోపేతానికి ఇప్పటి నుండే సమాయత్తం అవుతోంది. ఇదే క్రమంలో రాష్ట్రంలో బలీయమైన శక్తిగా ఉన్న వైసీపీని ఒంటరిగా ఎదుర్కోవడం అసాధ్యమని జనసేన, బీజేపీతో మరో సారి పొత్తుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. వారు అనుకున్నట్లు వర్క్ అయితే జనసేన, బీజేపీతో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
గెలుపు ధీమాలో వైసీపీ
ప్రస్తుతం అధికార వైసీపీకి బీజేపీకి లోపాయికారీ ఒప్పందాలు ఉన్నాయని పుకారు ఉన్నప్పటికీ రాబోయే ఎన్నికల నాటికి టీడీపీతో జనసేన – బీజేపీలు జత కలుస్తాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా వైసీపీ ఒంటరిగానే పోటీ చేసి అధికారాన్ని నిలుపుకునే సత్తా ఉందని ఆ పార్టీ శ్రేణులు ఢంకా భజాయించి చెబుతున్నారు. వైసీపీ, జగన్ వ్యూహాలు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల ప్రతి వ్యూహాలు రాబోయే రోజుల్లో ఎలా ఉంటాయో చూడాలి మరి.