AP Politics: రాజకీయ పార్టీలు అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరించడం సహజం. ప్రత్యేక హోదా అంశంపై గతంలో వైసీపీ పాడిన పాటనే నేడు టీడీపీ పాడుతోంది. ప్రత్యేక హోదా అంశంపై టీడీపీ పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేస్తే వైసీపీ సభ్యులు రాజీనామా చేస్తారనీ కలిసి కేంద్రంపై పోరాడదామని గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పేర్కొన్నారు. అప్పుడు వైసీపీ కోరికను టీడీపీ మన్నించలేదు. కలిసి ఉద్యమం చేయడానికి ముందుకు రాలేదు. అయితే ఇప్పుడు టీడీపీ అదే పాట పాడుతోంది. వైసీపీ పార్లమెంట్ సభ్యులు ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసే తాము చేస్తామని టీడీపీ పేర్కొంటోంది. ఏపికి ప్రత్యేక హోదాపై వైసీపీ కార్యాచరణ ప్రకటిస్తే తాము కూడా మద్దతిస్తామని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు.
AP Politics: ప్రత్యేక హోదాపై వైసీపీ కార్యాచరణ ప్రకటిస్తే టీడీపీ మద్దతు
కేంద్రం హోంశాఖ త్రిసభ్య కమిటీ అజెండాలో ప్రత్యేక హోదా అంశం పెట్టకోపవడం ఏమిటని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీకి 28 మంది ఎంపీలు ఉన్నప్పటికీ కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా అంశంపై వైసీపీ ప్రబుత్వానిది వైఫల్యమా..? లొంగుబాటా..? అని ప్రశ్నించారు. వైసీపీ తీరుపై సందేహాలు కలుగుతున్నాయన్నారు. హోదాపై మంచి పరిణామం ఎదురైతే వైసీపీకి, చెడు పరిణామం ఎదురైతే చంద్రబాబుకు ఆపాదిస్తున్నారని కనకమేడల ఆరోపించారు. ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే వైసీపీ కార్యాచరణ ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు కనకమేడల. హోదాపై ఏ విధంగా ముందుకు పోదల్చుకున్నారో చెబితే అందుకు టీడీపీ కూడా మద్దతు ఇస్తుందని తెలిపారు. హోదా సాదించడం వైసీపీ వల్ల కాదని జగన్ చెబితే టీడీపీ కార్యాచరణ ప్రకటిస్తుందని కనకమేడల స్పష్టం చేశారు.
అజెండా నుండి ప్రత్యేక హోదా తొలగింపు
రాష్ట్ర విభజన సమస్యలపై చర్చించేందుకు కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ తొలి సమావేశం ఈ నెల 17వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశ అజెండాలో తొలుత ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చడంతో ఇది తమ ఘనతగా వైసీపీ చెప్పుకోంది. అయితే ఈ అజెండాలోని అంశాలపై సందేహాలను వ్యక్తం చేస్తూ బీజేపీ రాజ్యసభ్యుడు జీవీఎల్ నర్శింహరావు కేంద్ర పెద్దలతో చర్చలు జరిపిన నేపథ్యంలో ఆ అజెండాను మార్పు చేసింది కేంద్ర హోంశాఖ. ఆ అజెండా నుండి ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించారు. దీంతో వైసీపీ నేతలు చంద్రబాబు, టీడీపీ కుట్ర అంటూ విమర్శలు చేశారు. దీనిపై కనకమేడల కౌంటర్ ఇచ్చారు.