ఎస్ఈసీ నిమ్మగడ్డ ఇచ్చిన గ్రామ పంచాయతీల ఎన్నికల షెడ్యూల్ను హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ ఎస్ఈసీ డివిజన్ బెంచ్కి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై నేడు (మంగళవారం) విచారణ జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ అయ్యారు.
స్థానిక ఎన్నికల ప్రక్రియ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నిమ్మగడ్డ ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్న విషయాన్ని తెలియజేయనున్నారు. ఎస్ఈసీలోని ఉద్యోగులను ప్రభుత్వం ప్రభావితం చేస్తుందని ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.ఎన్నికల షెడ్యుల్ విడుదల చేసిన తరువాత ఎస్ఈసీ జాయింట్ డెరెక్టర్ సాయి ప్రసాద్ నెల రోజుల పాటు సెలవుపై వెళ్లారు. ఈ విషయాన్ని నిమ్మగడ్డ గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లనున్నారు.
దేశ వ్యాప్తంగా ఈ నెల 16వ తేదీ నుండి మొదటి దశ కరోనా వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్..ఎస్ఈసీ నిమ్మగడ్డకు ఎటువంటి సూచనలు అందిస్తారనేది ఇప్పుడు కీలకంగా మారింది.సాధారణంగా అయితే ఎన్నికల సంఘం విధులను కోర్టులు అడ్డుకోవు. గత తీర్పులను పరిశీలిస్తే ఇది అవగతం అవుతుంది. అయితే ప్రస్తుతం కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుండటం ప్రత్యేక పరిస్థితులుగా పరిగణించాల్సి వస్తోంది. ప్రజారోగ్యం అన్న కారణం చూపే హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యుల్ ఉత్తర్వులను కొట్టివేసింది.ఈ పరిస్థితుల్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్ తో ఎస్ఈసీ నిమ్మగడ్డ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. నేడు హైకోర్టు డివిజన్ బెంచ్ లో ఎన్నికల సంఘం పిటిషన్ పై జరిగే విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇది కూడా చదవండి..బ్రేకింగ్ : పంచాయతీ పోల్స్పై హైకోర్టులో ఎస్ఈసీకి ఎదురుదెబ్బ