Nimmagadda : ఏపిలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, వైసీపీ ప్రభుత్వం ఉప్పు, నిప్పుగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. పంచాయతీ ఎన్నికలకు ముందు ఎస్ఈసీ నిమ్మగడ్డతో ప్రభుత్వం పెద్ద ఎత్తున పేచీ పెట్టుకున్నా.. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికలకు సహకరించింది. పంచాయతీ ఎన్నికలు ముగుస్తున్న వెంటనే జడ్పీటీసీ, ఎంపీటీసీ, పురపాలక సంఘ ఎన్నికలు నిర్వహించాలంటూ ప్రభుత్వం ఎస్ఈసీని కోరింది.
అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పరిషత్ ఎన్నికలను పక్కన బెట్టి పురపాలక ఎన్నికలు నిర్వహించారు. ఆ తరువాత అయినా ఎంపీటీసీ, జడ్ పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారనుకుంటే వాటి ఊసే ఎత్తలేదు. పరిషత్ ఎన్నికలు నిర్వహించేలా ఎస్ఈసీకి ఆదేశాలు ఇవ్వాలంటూ ప్రభుత్వం హైకోర్టునూ ఆశ్రయించింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. ఎన్నికల నిర్వహించాలంటూ ఎస్ఈసీని ఆదేశించలేమని హైకోర్టు తేల్చి చెబుతూ ఈ నెల 30వ తేదీకి విచారణను వాయిదా వేసింది.
ఇది ఇలా ఉండగా పరిషత్ ఎన్నికలు నిర్వహించకపోవడంపై ఎస్ఈసీపై ప్రభుత్వంలోని పెద్దలూ విమర్శించారు. మరో పక్క మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్సా సత్యనారాయణలు దాఖలు చేసిన సభాహక్కుల ఉల్లంఘన పిర్యాదుపై ఎస్ఈసీ నిమ్మగడ్డకు అసెంబ్లీ ప్రివిలైజ్ కమిటీ నోటీసు జారీ చేసింది. దీనిపై ఎస్ఈసీ వివరణ ఇచ్చారు. తాజాగా నిన్న ప్రస్తుత పరిస్థితిలో పరిషత్ ఎన్నికలు నిర్వహించలేమని ఎస్ఈసీ నిమ్మగడ్డ తేల్చి చెప్పేశారు. ఈ నెల 31వ తేదీ తాను రిటైర్ అవుతున్నాననీ, తదుపరి వచ్చే కమిషనర్ ఎన్నికల నిర్వహణ బాధ్యతలు చూస్తారని చెప్పుకొచ్చారు. ఆరు రోజుల వ్యవధిలో పూర్తి అయ్యే పరిషత్ ఎన్నికలకు ఎస్ఈసీ వ్యాక్సినేషన్ సాకుగా చూపడాన్ని అధికార పార్టీ నేతలు తప్పుబడుతున్నారు.
అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలకు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతూ జనసేన పార్టీ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఏడాది క్రితం నోటిపికేషన్ ఇచ్చారనీ, అప్పటికి ఇప్పటికి పరిస్థితులు మారాయని కావున ఫ్రెష్ నోటిఫికేషన్ జారీ చేసేలా ఎస్ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని జనసేన కోరింది.
అయితే దీనిపై ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని ఎస్ఈసీకి ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. మరో ఆరు రోజుల్లో రిటైర్ అవుతున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్ఈసీ హోదాలో కోర్టుకు కౌంటర్ దాఖలు చేస్తారా లేక కొత్తగా వచ్చే కమిషనర్ కు ఆ విషయాన్ని వదిలివేస్తారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. అధికార వైసీపీ మొదటి నుండి గత నోటిఫికేషన్ ఆధారంగానే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వస్తోంది. ప్రతిపక్షాలు మాత్రం ఆ నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతున్నాయి.
ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్ఈసీ హోదాలో కొత్త నోటిఫికేషన్ జారీకి అభ్యంతరం లేదని కోర్టులో కౌంటర్ దాఖలు చేస్తే మరో మారు ఇది వివాదాస్పదం అవుతుంది. రిటైర్ అవుతున్నాను కదా తనకు ఎందుకులే ఈ సమస్య అని నిమ్మగడ్డ నాలుగు రోజులు సైలెంట్ ఉంటే ఏ సమస్య ఉండదు. ప్రభుత్వంతో ఉన్న విభేదాల నేపథ్యంలో నిమ్మగడ్డ ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.