AP Skill Development Scam: ఏపి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో నిందితుడుగా అభియోగాలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణ నేడు ఏపి సీఐడీ ఎదుట హజరు కావాల్సి ఉంది. అయితే ఆయన సీఐడీ ఎదుట హజరు అవుతారా లేదా అన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారుతోంది. ఏపి స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ లో రూ.241 కోట్లు కుంభకోణం జరిగిందని ఏపీ సీఐడీ 26 మందిపై కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో ఇటీవల గతంలో స్కిల్ డవలప్మెంట్ కార్పోరేషన్ లో డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించిన రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణ నివాసంలో ఏపీ సీఐడీ సోదాలు నిర్వహించింది. సోదాలు పూర్తి అయిన వెంటనే ఆయనను అదుపులోకి తీసుకుని విచారించాలని సీఐడీ అధికారులు భావించగా, ఆయన అస్వస్థకు గురై ఆసుపత్రిలో చేరడంతో కస్టడీలోకి తీసుకోవడం కుదరలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 13వ తేదీన విచారణకు తమ ఎదుట హజరు కావాలని లక్ష్మీనారాయణకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
AP Skill Development Scam: ఏడు షెల్ కంపెనీలకు రూ.241 కోట్లు తరలింపు
ఈ కేసులో ఇప్పటికే ఏపీ సీఐడీ ముగ్గురు నిందితులను అరెస్టు చేసింది. సీమెన్స్ ఎండి సౌమ్యాద్రి శేఖర్ బోస్, డిజైన్ టెక్ ఎండి వికాస్ కన్విల్కర్, స్కిల్లర్ కంపెనీ ముఖేష్ లను అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హజరుపర్చగా రెండు వారాలు రిమాండ్ విధించింది. దీంతో వీళ్లను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్, పూణే, ముంబాయి, ఢిల్లీలో సోదాలు జరిపి పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది ఏపీ సీఐడీ. టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ట్రైనింగ్ ఇచ్చారు. ఇందు కోసం 2017 – 18లో రూ.371 కోట్లు విడుదల చేయగా అందులో రూ.241 కోట్లను ఏడు షెల్ కంపెనీలకు తప్పుడు ఇన్ వాయిస్ లు సృష్టించి తరలించినట్లు సీఐడీ విచారణలో తేల్చింది.