AP Special Status: ఏపి, తెలంగాణ విభజన అంశాలపై ఈ నెల 17వ తేదీన కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ముందుగా తొమ్మిది అంశాలతో కేంద్ర హోంశాఖ అజెండాను రూపొందించింది. వీటిలో ఏపికి ప్రత్యేక హోదా అంశాన్ని కూడా చేర్చారు. ఈ అజండాను పేర్కొంటూ ఈ ఉదయం రెండు రాష్ట్రాలను చర్చలకు ఆహ్వానించిన కేంద్రం అనూహ్యంగా దాన్ని వెనక్కు తీసుకుంది. కేంద్ర హోంశాఖ ఈ ఉదయం జారీ చేసిన అజెండాలో మార్పులు చేసి కొత్త అజెండాతో సర్కులర్ జారీ చేసింది. తాజాగా విడుదల చేసిన సర్కులర్ అజెండాలో ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించింది కేంద్ర హోంశాఖ. కేవలం అయిదు అంశాలతో మాత్రమే అజెండా తయారు చేసింది. త్రిసభ్య కమిటీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ విభజన అంశం, తెలంగాణ నుండి రావాల్సిన విద్యుత్ బకాయిలు, పన్నుల విషయంలో లోటుపాట్లు, నగదు నిల్వ, బ్యాంకు డిపాజిట్లు, రెండు రాష్ట్రాల పౌరసరఫరాల శాఖల్లో నగదు క్రెడిట్ జమ అంశాలపై చర్చ జరగనుంది.
అజెండా మార్పునకు కారణం ఏమిటంటే..
ముగిసిన అధ్యాయంగా భావిస్తున్న ప్రత్యేక హోదా అంశం మళ్లీ తెరపైకి రావడంతో ఏపి వ్యాప్తంగా సంతోషం వ్యక్తం అయ్యింది. ఇది తమ ఘనతగా వైసీపీ ఎంపీలు చెప్పుకున్నారు. దీనిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్శింహరావు స్పందిస్తూ ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే తెలంగాణతో చర్చించాలా అని ప్రశ్నించారు. ఆ అజెండాపై స్పష్టత తీసుకునేందుకు కేంద్రంలోని సీనియర్ అధికారులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా అనేది రెండు రాష్ట్రాలకు సంబంధించిన విభజన అంశం కాదనీ, ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే సంబంధించిన అంశమని అదే విధంగా రెవెన్యూ లోటు కూడా ఏపికి మాత్రమే సంబందించిన అంశమని ఈ రెండు అంశాలు అజెండాలోకి ఎలా వచ్చాయని జీవీఎల్ వాకబు చేశారు.
ఈ కమిటీ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఆర్ధికపరమైన విషయాల్లో ఎక్కడ విభేదాలు ఉన్నాయో అవి పరిష్కరించడానికి మాత్రమే ఏర్పాటైన కమిటీ అని ఇందులో ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు అంశాలపై చర్చకు అస్కారం లేదని తెలిసిందనీ, దీంతో మళ్లీ కొత్త అజెండాతో కేంద్ర హోంశాఖ సర్క్యులర్ జారీ చేసిందన్నారు. ప్రస్తుతం మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉండటంతో వివరణ ఇస్తున్నానని పేర్కొన్నారు జీవీఎల్ నర్శింహరావు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు.