AP Special Status: ఏపికి ప్రత్యేక హోదా అంశం మరో మారు తెరపైకి వచ్చింది. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి కారణాలు ఏమిటో చెప్పాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు ఏపికి ఎందుకు ఇవ్వడం లేదో తెలపాల్సి ఉందనీ, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా వివరాలు సమర్పించాలని పేర్కొంది. విచారణను డిసెంబర్ 20వ తేదీకి వాయిదా వేసింది.
AP Special Status: ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదు
ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చి ఆ హామీని అమలు చేయడం లేదని అమలాపురంకు చెందిన న్యాయవాది రాజేశ్ చంద్ర వర్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరపగా న్యాయవాది ఎం రామారావు వాదనలు వినిపించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపిని ఆదుకునేందుకు అప్పటి ప్రధాన మంత్రి పార్లమెంట్ లో ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలకు హోదా ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ఏపి విషయంలో హామీని నిలబెట్టుకోలేదని అన్నారు. పలు రాష్ట్రాలకు హోదా ఇచ్చినప్పుడు ఏపి విషయంలో ఎందుకు ఇవ్వడం లేదని కేంద్రాన్ని హైకోర్టు ప్రశ్నించింది. విభజన కారణంగా ఏపి నష్టపోయిందనీ, ప్రత్యేక హోదా ఇవ్వాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది.
కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయాలి
కేంద్ర ప్రభుత్వ తరపు న్యాయవాది సమాధానం ఇస్తూ హోదా వ్యవహారంలో సుప్రీం కోర్టులో పిటిషన్ లు పెండింగ్ లో ఉన్నాయని వివరించారు. ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలకు, ఏపికి భౌగోళిక పరిస్థితుల విషయంలో తేడా ఉందన్నారు. ఇరుపక్షాల వాదనలు ఇచ్చి ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేస్తూ తదుపరి విచారణను డిసెంబర్ 20వ తేదీకి వాయిదా వేసింది.