AP Special Status: రాష్ట్ర విభజన జరిగి దాదాపు ఎనిమిది సంవత్సరాలు కావస్తుంది. విభజన చట్టంలోని అంశాలు ఏవి పరిష్కారం కాలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి ఆస్తులు, అప్పులు పంపకం వంటి ఆర్ధిక పరమైన అంశాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండిపోయారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటూ కేంద్రంలోని బీజేపీ పెద్దలు చెబుతూ వచ్చారు. గత టీడీపీ హయాంలో ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారనీ, ప్యాకేజీ ప్రకారం నిధులు విడుదల చేస్తున్నామంటూ కేంద్రం చెబుతూ వచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి కేంద్ర పెద్దల వద్ద ప్రత్యేక హోదా అంశం లేవనెత్తుతూనే ఉన్నారు. ఏపికి చెందిన పార్లమెంట్ సభ్యులు కేంద్రాన్ని ప్రత్యేక హోదా గురించి అడుగుతూనే ఉన్నారు. ఈ తరుణంలో ముగిసిపోయిన అధ్యాయం అంటూ పేర్కొంటున్న ప్రత్యేక హోదా అంశం ఇప్పుడు మళ్లీ తెరపైకి రావడం, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ అజెండాలో దీన్ని చేర్చడం ఓ రకంగా ఏపికి గుడ్ న్యూస్ గానే చెప్పుకోవచ్చు.
AP Special Status: ఈ నెల 17న త్రిసభ్య కమిటీ సమావేశం
తెలుగు రాష్ట్రాల మధ్య పరిష్కృతంగా ఉన్న విభజన వివాదాలను పరిష్కరించడం కోసం ఎట్టకేలకు కేంద్రం దృష్టి సారించింది. సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖ సెక్రటరీ నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి కేంద్ర హోంశాఖ సెక్రటరీ అశిష్ కుమార్ నేతృత్వం వహిస్తుండగా ఏపి ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, తెలంగాణ నుండి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సభ్యులుగా ఉంటారు. ఈ నెల 17న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కమిటీ మొదటి సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. మొత్తం తొమ్మిది అంశాలతో కూడిన అజెండా తో సమావేశానికి సిద్ధం కావాలని ఇరు రాష్ట్రాలకు కేంద్రం సమాచారం పంపింది.
అజెండాలో 9వ అంశంగా ప్రత్యేక హోదా
విభజన చట్టంలోని షెడ్యుల్ 9, 10 లోని సంస్థల విభజన సహా ఇతర అపరిష్కృత అంశాల పరిష్కారానికి తొలి అడుగు పడుతోంది. అజెండాలో 9వ అంశంగా ప్రత్యేక హోదా అంశాన్ని పేర్కొంది కేంద్ర హోంశాఖ. ఏపి ఫైనాన్స్ కార్పోరేషన్ విభజన, విద్యుత్ వినియోగ అంశాలు, పన్ను అంశాల్లో సవరణలు, బ్యాంకు డిపాజిట్ల పంపిణీ, ఏపిలో ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధి గ్రాంట్ తదితర అంశాలపై త్రిసభ్య కమిటీ చర్చించనుంది.