AP Special Status Issue: ఏపికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలపై రాజ్యసభలో వైసీపీ సభ్యులు వెల్ లోకి వెళ్లి నిరసన తెలియజేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి విషయంపై రాజ్యసభలో వెంటనే చర్చ చేపట్టాలని వైసీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్లమెంటరీ పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు సోమవారం నోటీసు ఇచ్చారు. సభ నియమ నిబంధనలలోని రూల్ 267 కింద ఆయన నోటీసులు ఇచ్చారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుండి ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్యసభలో సోమవారం నిర్వహించే ఇతర వ్యవహారాలు అన్నింటినీ పక్కన పెట్టి రూల్ 267 కింద ఏపి ప్రత్యేక హోదా అంశంపై చర్చను ప్రారంభించాలని విజయసాయి రెడ్డి నోటీసులో కోరారు. ఈ అంశం ఎంత అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నదో విజయసాయి రెడ్డి నోటీసులో క్లుప్తంగా వివరించారు. రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఏపికి పలు హామీలను ప్రకటించారని అందులో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అతి అప్రధానమైనదని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి ఇచ్చిన హామీని మార్చి 2014 మార్చి 1న జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో చర్చించి ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఆమోదించిందన్నారు. కానీ ఇది జరిగి ఏడు సంవత్సరాలు కావస్తున్నా కేంద్ర మంత్రి మండలి హామీని నెరవేర్చలేదని కావున ఈ రోజు సభ కార్యక్రమాలు అన్నింటినీ రద్దు చేసి సభలో తక్షణమే ఈ అంశంపై తగిన నిర్ణయం తీసుకోవాలని విజయసాయి నోటీసులో పేర్కొన్నారు. అయితే వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు రాజ్యసభ వెల్ లోకి వెళ్లి నిరసన తెలిపారు. దీంతో సభను వెంకయ్య నాయుడు గంట పాటు వాయిదా వేశారు.అనంతరం సమావేశమైన సభలో విపక్ష ఎంపిలు ఆందోళనకు దిగారు. నినాదాలు చేస్తూ వెల్ లోకి దూసుకువచ్చారు. దీంతో మరో సారి సభను వాయిదా వేస్తున్నట్లు వెంకయ్య నాయుడు ప్రకటించారు.
కాగా కొత్తగా లోక్ సభకు ఎన్నికైన ఎంపిలతో స్పీకర్ ఓం బిర్లా ప్రమాణ స్వీకారం చేయించారు. మాదిళ్ల గురుమూర్తి (వైసీపీ), మంగళ్ సురేష్ అంగడి (బీజేపీ), అబ్దుస్మద్ సమదన్ (ఐయూఎంఎల్), విజయకుమార్ (కాంగ్రెస్) ఎంపిలుగా ప్రమాణం చేశారు. రాజ్యసభలో అబ్ద్దుల్ వాహబ్ (ఐయూఎంఎల్) ఎంపిగా ప్రమాణ స్వీకారం చేశారు.