ఏపిలో పంచాయతీ ఎన్నికల నగరా మోగింది. ఒక పక్క హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు సుప్రీం కోర్టును ఆశ్రయించినా ఎస్ఈసీ మాత్రం తాను ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం శనివారం మొదటి దశ పోలింగ్ నకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సంఘం రాజ్యాంగ స్పూర్తితో ఏర్పడిందని, ఎన్నికలు నిర్వహించమే తమ బాధ్యత అని పేర్కొన్నారు. ఈ లోపుగా సుప్రీం కోర్టు తీర్పు వస్తే తాము పాటిస్తామన్నారు. ఈ మధ్యాహ్నం సీఎస్, డీజీపీ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో అన్ని వర్గాలు సహకరించాలని నిమ్మగడ్డ కోరారు. అధికార యంత్రాంగంతో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి విబేధాలు లేవని స్పష్టం చేశారు నిమ్మగడ్డ, ఎన్నికల సంఘం ఆదేశాలపై సీఎస్, డీజీపీ పరిణితి చెందిన అధికారులుగా వ్యవహరిస్తారని భావిస్తున్నానన్నారు. పంచాయతీరాజ్ అధికారులు సమర్థవంతమైన పనితీరు కనబర్చాలన్నారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు అని్న నిర్వహిస్తామన్నారు.
రెెవెన్యూ డివిజన్ల ప్రాతిపదికగానే ఎన్నికలు జరుగుతాయని నిమ్మగడ్డ తెలిపారు. నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఉదయం 6.30గంటల నుండి మధ్యాహ్నం 3.30 గంటల వరకూ పోలింగ్ జరుగుతుందని తెలిపారు. సాయంత్రం 4గంటల తరువాత ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. విజయనగరం, ప్రకాశం జిల్లాలో తొలి విడత ఎన్నికలు నిర్వహించడం లేదని తెలిపారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు ఎవరు అవరోధం కలిగించాలని చూసినా కఠిన చర్యలు తప్పవని ఎస్ఈసీ నిమ్మగడ్డ హెచ్చరించారు. 2021 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని తొలుత భావించామనీ కానీ ఆ ప్రక్రియ పూర్తి కానందున 2019 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
ఈ నెల 25 నుండి నామినేషన్ లను స్వీకరిస్తారు. 27 వ తేదీ నామినేషన్ల దాఖలుకు తుది గడువు, 28న నామినేషన్ల పరిశీలన, 29న నామినేషన్ల పై వచ్చిన అభ్యంతరాల పరిశీలిస్తారు. 30న అభ్యంతరాలపై తుది నిర్ణయం, 31న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఉంటుంది. తరువాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. ఫిబ్రవరి 5న పోలింగ్, పోలింగ్ పూర్తి అయిన తరువాత సాయంత్రం ఓట్ల లెక్కింపు , ఫలితాల వెల్లడిస్తారు. ఆ తరువాత ఉప సర్పంచ్ ఎన్నికలను పూర్తి చేస్తారు.
తోలి దశలో శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ రెవెన్యూ డివిజన్ లు, విశాఖలో విశాఖ రెవెన్యూ డివిజన్, తూర్పు గోదావరి జిల్లాలో అమలాపురం రెవెన్యూ డివిజన్, పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు రెవెన్యూ డివిజన్, కృష్ణా జిల్లాలో నూజివీడు రెవెన్యూ డివిజన్, గుంటూరు జిల్లాలో గుంటూరు రెవెన్యూ డివిజన్, నెల్లూరు జిల్లాలో నెల్లూరు రెవెన్యూ డివిజన్, చిత్తూరు జిల్లాలో తిరుపతి రెవెన్యూ డివిజన్, కర్నూలు జిల్లాలో ఆదోని రెవెన్యూ డివిజన్, అనంతపురం జిల్లాలో పెనుగొండ రెవెన్యూ డివిజన్, కడప జిల్లాలో జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ లలో ఎన్నికలు జరగనున్నాయి.