TDP: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఏ క్షణంలోనైనా రావచ్చంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఇంకా రెండేళ్లు ఉన్నాయని నిద్రపోవద్దనీ, ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని అన్నారు అచ్చెన్నాయుడు. వాస్తవానికి ఏపిలో 2024లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, గత కొద్ది రోజులుగా అటు తెలంగాణలో, ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం నేపథ్యంలో అచ్చెన్నాయుడు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ లో రైతు విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్క్ షాపులో అచ్చెన్నాయుడు ఈ కామెంట్స్ చేశారు.
TDP: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సారి కచ్చితంగా 150కిపైగా స్థానాల్లో టీడీపీ విజయం సాధిస్తుందని అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు. రైతులను జగన్ సర్కార్ అడుగడుగునా ముంచిందని విమర్శించారు. ఉద్యోగుల నుండి పేదల వరకూ ప్రతి ఒక్క రంగాన్ని ప్రభుత్వం నాశనం చేసిందని విమర్శించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సైతం టీడీపీకి అంటగట్టాలని చూశారనీ, వివేకానందరెడ్డి హత్య ద్వారా వచ్చిన సానుభూతితోనే జగన్ సీఎం అయ్యారని అన్నారు. కోడికత్తి డ్రామా వల్ల సానుభూతి రాలేదని వివేకా హత్యకు తెరతీశారని అన్నారు.
TDP: రైతు విభాగం నేతలు ప్రతి రైతునూ కలవాలి
వివేకా హత్య కేసులో నిందితులను ఎందుకు శిక్షించడం లేదని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళతామన్నారు. రైతు విభాగం నేతలు రాష్ట్రంలోని ప్రతి రైతునూ కలవాలని అచ్చెన్న నిర్ధేశించారు. ఈ ప్రభుత్వంపై ప్రజల్లో ఇప్పుడు ఉన్నంత వ్యతిరేకత ఎప్పూడూ లేదని అన్నారు. అన్నీ రద్దు చేస్తూ వస్తున్న జగన్ రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తున్నట్లు లెటర్ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని అచ్చెన్నాయుడు అన్నారు.