టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఏపిలో తాజా రాజకీయ పరిణామాలపై వీరు ఇరువురు దాదాపు రెండు గంటలకు పైగా చర్చించారు.పార్టీల పొత్తుల అంశంపై క్లారిటీ ఇవ్వలేదు కానీ అధికార వైసీపీపై కలిసిపోరాటాలు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తొంది. మరో పక్క చంద్రబాబు, పవన్ భేటీ పై పలువురు మంత్రులు స్పందించి విమర్శలు గుప్పించారు. దీనికి ప్రతిగా వైసీపీపై టీడీపీ నేతలు ప్రతివిమర్శలు చేశారు. చంద్రబాబు, పవన్కళ్యాణ్ మళ్లీ ముసుగు తొలగించారనీ, ఇద్దరూ తెలంగాణలో సమావేశమై ఏపీపై కుట్ర చేస్తున్నారనీ, వారు ముందు నుంచి కలిసే ఉన్నారనీ, ఇప్పుడు అదే చేస్తున్నారంటూ మంత్రులు వ్యాఖ్యానించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. మాట్లాడుతూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలయిక కొత్త ఏమీ కాదనీ వారు ఇద్దరూ ఎప్పటి నుంచో కలిసే ఉన్నారని అన్నారు. రాష్ట్రం గురించి, ప్రజల ప్రయోజనాల గురించి వీళ్లకు పట్టదనీ, వారిద్దరికీ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని ఆయన విమర్శించారు. పవన్ కళ్యాణ్కు పేద ప్రజల ప్రాణాలు కంటే చంద్రబాబుబే ముఖ్యమని పేర్కొన్నారు. నాడు చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కోసం గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే పవన్ కనీసం మాట్లాడలేదని అన్నారు. .మళ్లీ ఇప్పుడు చంద్రబాబు సభల్లో కందుకూరు, గుంటూరులో తొక్కిసలాటకు 11 మంది బలి అయినా పవన్ నోరెత్తలేదన్నారు. కానీ ఇప్పుడు ఇద్దరూ తెలంగాణలో భేటీ అయి ఏపీపై కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.
పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందిస్తూ ప్యాకేజ్ స్టార్ పవన్ పండగ మామూలు కోసం చంద్రబాబు ఇంటికి వెళ్ళారంటూ సెటైర్ వేశారు. ఇద్దరి భేటీ కొత్త కాదని అన్నారు. మంత్రులపై జన సైనికులు దాడి చేస్తే చంద్రబాబు పరామర్శిస్తారనీ, చంద్రబాబు సభలో జనం చనిపోతే పవన్ కళ్యాణ్ పరామర్శకు వెళ్లరంటూ వ్యంగ్యంగా విమర్శించారు. వీరిద్దరూ జనాన్ని మోసగించడం పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. అమాయకపు జనసేన కార్యకర్తలను పవన్ అమ్మకానికి పెట్టారని విమర్శించారు. పవన్ సీఎం అవుతారని జనసేన కార్యకర్తలు ఆశపడుతున్నారు కానీ అది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. చంద్రబాబు వేసే ఎంగిలి మెతుకులన్ని సీట్లతో పవన్ మ్యాజిక్ ఫిగర్ ఎలా చేరుకుంటారన్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ .. చంద్రబాబుతో పవన్ భేటీపై స్పందిస్తూ చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్లది అనైతిక పొత్తు అని అన్నారు. ఎవరైనా ఒక ప్రత్యేకమైన ఎజెండాతో రాజకీయాలు చేయాలి కానీ వీళ్లది మిక్స్డ్ ఎజెండా అని విమర్శించారు. ప్రజలకు జరిగే మంచిని అడ్డుకోవడమే వారి ఎజెండా అని మండిపడ్డారు. చంద్రబాబు డైరెక్టర్ అయితే పవన్కళ్యాణ్ యాక్టర్ అని సీఎం జగన్ ఎప్పుడో చెప్పారనీ, ఇవేళ వారిద్దరి కలయిక ద్వారా రాష్ట్ర ప్రజలకు ఉన్న అనుమానాలన్నీ తొలిగిపోయాయన్నారు. బలం లేని వాడు పక్కనోడి బలాన్ని తీసుకుని తాను బలవంతుడిని అని చెప్పుకోవాలనే ప్రయత్నమే చంద్రబాబుదని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రజలు మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరని స్పష్టం చేశారు.
జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ సీఎం వైయస్ జగన్ తొలి నుంచి ఏం చెబుతున్నారో.. చంద్రబాబు, పవన్కళ్యాణ్ ఇవాళ అదే చేస్తున్నారన్నారు. చంద్రబాబు ఏం చెబితే అది చేయడానికి పవన్కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. ఇద్దరూ సీట్లు సర్దుబాటు చేసుకోబోతున్నారని అన్నారు. పదో పరకో తీసుకుని చంద్రబాబుకు ఊడిగం చేసేందుకు పవన్కళ్యాణ్ సిద్ధంగా ఉన్నాడని అంబటి విమర్శించారు. పవన్కళ్యాణ్ అనే వ్యక్తి పావలాకో పదికో పరకకో లాలూచీ పడి ఈ రాష్ట్రంలో తనను నమ్ముకుని ఉన్న కాపు సామాజికవర్గ ఓటర్లందర్నీ గంపగుత్తగా చంద్రబాబుకు ఊడిగం చేయడానికి తీసుకెళ్తాడు తప్ప జరిగేది ఏమీ లేదన్నారు. పవన్కళ్యాణ్ సీఎం అవుతాడని ఆశ పడుతూ గొంతు చించుకుని అరిచే వాళ్లంతా ఇప్పుడు పవన్కళ్యాణ్ను ప్రశ్నించాలని అంబటి విజ్ఞప్తి చేశారు. ఏదో మీడియాలో పెద్ద కవరేజీ కోసం వారిద్దరి ఆరాటమే తప్ప, వారిద్దరి కలయికలో పెద్ద పస ఏమీ లేదని పేర్కొన్నారు. బీజేపీతో విడాకులు కాకుండా చంద్రబాబుతో సంబంధానికి అర్థం ఏమిటి, వారికి నైతిక విలువలు ఉన్నాయా అని అంబటి ప్రశ్నించారు. చిరంజీవి గతంలో ఏకంగా తన పార్టీని కాంగ్రెస్లో కలిపేశాడనీ, అలాగే, పవన్కళ్యాణ్ను కూడా తన పార్టీని తెలుగుదేశం పార్టీలో కలిపేస్తే ఎవరు వద్దంటారు అని ప్రశ్నించారు. వారు ఎన్ని కుట్రలు చేసినా, చేయాలనుకున్నా 2024లో మళ్లీ వైయస్ ఆర్ సీపీ విజయాన్ని అడ్డుకోలేరని అంబటి స్పష్టం చేశారు.
మరో మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ సంక్రాంతి ప్యాకేజీ కోసమే పవన్కళ్యాణ్ చంద్రబాబు ఇంటికి వెళ్లాడని విమర్శించారు. నిజంగా బుద్ధున్నవాడైతే కందుకూరు, గుంటూరులో కలిసి 11 మంది చనిపోయినప్పడుడే వారి కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తారనీ, కానీ అందుకు భిన్నంగా చంద్రబాబు ఇంటికి పరామర్శకు వెళ్లడం ఏమిటి అని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్కళ్యాణ్ లకు సిగ్గూశరం ఏనాడో పోయాయనీ, వాళ్లిద్దరూ నైతిక విలువలను ఏనాడో వదిలివేశారని దుయ్యబట్టారు.సీట్లు, ప్యాకేజీ ల పై చర్చించేందుకే దత్తతండ్రి వద్దకు దత్తపుత్రుడు వెళ్లిన భేటీనే తప్ప, మరొకటి కాదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలంతా సంతోషంగా ఉంటే.. వవన్, చంద్రబాబు ఇద్దరూ చీకటి ఒప్పందాలతో ఈ ప్రజా ప్రభుత్వాన్ని ఎలా అస్థిరపరచాలని కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు.
మంత్రుల విమర్శలపై టీడీపీ నేతలు కౌంటర్ లు ఇచ్చారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిస్తే రాష్ట్రంలో ప్రభంజనమేనని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. వైసీపీతో కలిసేందుకు ఒక్క పార్టీ కూడా ముందుకు రావడం లేదన్నారు. పవన్ – చంద్రబాబు కలయికతో వైసీపీ నేతలకు ప్యాంట్లు తడిసిపోతున్నాయని సెటైర్ వేశారు. ఎందుకైనా మంచిది వైసీపీ నేతలు డైపర్స్ వాడితే మంచిదంటూ విమర్శించారు. దుర్మార్గపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క కూడా చీలనివ్వనని పవన్ కళ్యాణ్ చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. దేశంలో అనేక ప్రాంతాల్లో అనేక పార్టీలు కలిసి పని చేసిన సందర్భాలు ఉన్నాయని సోమిరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీడీపీ సీనియర్ నేత,మరో మాజీ మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప వైసీపీ నేతల విమర్శలపై స్పందిస్తూ చంద్రబాబు – పవన్ కళ్యాణ్ కలిస్తే మీరు (వైసీపీ) ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. ఇద్దరు కలిస్తే ఓడిపోతామన్న భయంతోనే అలా మాట్లాడుతున్నట్లు ఉందని అన్నారు. ఓటమి భయంతోనే నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని చిన రాజప్ప కౌంటర్ ఇచ్చారు.
Official: చంద్రబాబు ఇంటికి వెళ్లిన పవన్ కళ్యాణ్.. ఏ అంశాలపై చర్చించారంటే.!?