Teachers Protest: ఏపి ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాఫ్టో) కలెక్టరేట్ల ముట్టడికి పిలుపు నిచ్చిన నేపథ్యంలో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలు రోడ్డు మీదకు వచ్చాయి. మరో పక్క కలెక్టరేట్ల ముట్టడిని అడ్డుకునేందుకు పోలీసులు ఉపాధ్యాయ సంఘాల నేతలను రాత్రి నుండి అడ్డుకున్నారు. కలెక్టరేట్ల ముట్టడికి అనుమతి లేదని నోటీసులు జారీ చేసి చాలా జిల్లాల్లో నేతలను గృహ నిర్బంధాలు చేశారు. నోటీసులను పట్టించుకోకుండా వెళ్లే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసినా జిల్లాల్లో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు ఆందోళనలో పాల్గొన్నారు.
Teachers Protest: నెల్లూరులో ఉద్రిక్తత
నెల్లూరు, ఒంగోలు, విశాఖ, చిత్తూరు, కడప, మచిలీపట్నం, ఏలూరు తదితర జిల్లా కేంద్రాల్లో ఉపాధ్యాయుల ఆందోళన కొనసాగుతోంది. నెల్లూరులో పోలీసు వలయాన్ని ఛేదించి ఉపాధ్యాయులు ముందుకు రావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ ల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. పలు జిల్లాల్లో కలెక్టరేట్ కు వెళుతున్న ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించగా పోలీస్ స్టేషన్ వద్దే నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
ఉపాధ్యాయ నేతల అరెస్టు
చిత్తూరు జిల్లా ఎస్టీయూ అధ్యక్షుడు జగన్, ప్రధాన కార్యదర్శి మధుసూధన్, కడప జిల్లాలో యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, శ్రీకాకుళంలో ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం, యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షుడు బాబూరావు ఇలా అన్ని జిల్లాల్లో ముఖ్య నేతలను గృహ నిర్బంధం, అరెస్టులు చేశారు. శాంతియుతంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటుంటే అక్రమ అరెస్టులు చేయడం సరికాదని ఉపాధ్యాయ సంఘ నేతలు పేర్కొంటున్నారు. రివర్స్ పీఆర్సీ జివోలను వెనక్కు తీసుకోవాలని నినాదాలు చేస్తూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు.