AP Telangana water War: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నేపథ్యంలో ప్రాజెక్టుల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన డ్యామ్ ల వద్ద, జల విద్యుత్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున పోలీసు సిబ్బంది పహారా కాస్తున్నారు. ఏపి అభ్యంతరాలను పట్టించుకోకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులలో జల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. దీనిపై ఏపి ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది.
భద్రతా కారణాల దృష్యా జూరాల ప్రాజెక్టు మీద రాకపోకలను అధికారులు నిలిపివేయడం జరిగింది. ప్రాజెక్టు వద్ద పోలీసులు పర్యవేక్షణ చేస్తూ ఎవరిని అటువైటు వదలడం లేదు. దీంతో గద్వాల – ఆత్మకూరు, మక్తల్ తదితర ప్రాంతాల రాకపోకలు బంద్ అయ్యాయి. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు వద్ద రాకపోకలు నిలిపివేయడం వల్ల ఈ మార్గంలో ఎవరూ ప్రయాణాలు పెట్టుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు.
జల విద్యుత్ ఉత్పత్తిపై ఏపి సర్కార్ కేంద్రానికి ఫిర్యాదు చేయగా టీఎస్ సర్కార్ రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఫిర్యాదు చేసింది. మరో పక్క ఏపి, తెలంగాణ అధికార పార్టీ నేతలు, మంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. ఈ జల జగడంపై కేంద్ర జోక్యం చేసుకుని రెండు రాష్ట్రాల మధ్య సమన్వయానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని వివిధ రాజకీయ పక్షాలు పేర్కొంటున్నాయి.