AP Three Capital Issue: మూడు రాజధానుల అంశానికి సంబంధించి సీఎం వైఎస్ జగన్ ఎటూ తేల్చలేదు. విస్తృత విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకు ఇంతకు ముందు ఆమోదించిన మూడు రాజధానుల బిల్లును ఉపసంహరిస్తున్నట్లు వెల్లడించారు. తొలుత మూడు రాజధానుల బిల్లు రద్దుకు కేబినెట్ ఆమోదం తెలపడంతో అసెంబ్లీలో దీనిపై సీఎం జగన్ కీలక ప్రకటన చేయనున్నారని అందరూ భావించారు. అయితే జగన్ దీనిపై ఏమీ తేల్చకుండా పూర్తి స్థాయిలో మరో బిల్లును తీసుకురానున్నట్లు తెలిపారు. తొలుత అసెంబ్లీ ముందుకు మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లు చర్చకు వచ్చింది. ఈ బిల్లును ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. బిల్లుపై చర్చకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అనుమతించారు.
AP Three Capital Issue: అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానులు
చర్చ అనంతరం సీఎం జగన్మోహనరెడ్డి మాట్లాడుతూ 1953 నుండి 56వరకు ఏపిలో రాజధానిగా కర్నూలు ఉండేది, గుంటూరులో హైకోర్టులో ఉండేది. ఈ ప్రాంతం అంటే నాకు ఎటువంటి వ్యతిరేకత లేదు. నా ఇల్లు కూడా ఇక్కడే ఉంది. ఈ ప్రాంతం అంటే ప్రేమ కూడా ఉంది. ఈ ప్రాంతం అటు విజయవాడ, ఇటు గుంటూరుకు దగ్గర ఏమీ కాదు. ఇక్కడ రోడ్లు, కరెంటు, డ్రైనేజీ వంటి కనీస సౌకర్యాల ఏర్పాటుకు మాత్రమే అయ్యే ఖర్చు లక్ష కోట్లు అని లెక్కేశారు. అది ఈ రోజు లెక్కల ప్రకారం, పదేళ్లు పోతే ఆ ఖర్చు ఆరు లక్షల కోట్లో 7 లక్షల కోట్లు అవుతుంది. రాజధాని అనే ఊహా చిత్రం సాధ్యం అవుతుందా అని ప్రశ్నించారు. ఇంకా ఉపాధి అవకాశాల కోసం పెద్దనగరాలైన హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు మన పిల్లలు వెళ్లాల్సిందేనా అన్నారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఉదేశంతోనే విశాఖలో పరిపాలనా రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధానిగా మూడు రాజధానులను తీసుకువచ్చామన్నారు. డీసెంట్రలైజేషన్ ద్వారా మంచి చేయాలని తలంచామన్నారు.
విస్తృత విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే..
ఈ ఏడాదిన్నర కాలంగా రకరకాలుగా అపోహాలు కల్గిస్తూ, న్యాయపరమైన చిక్కులు తీసుకువచ్చి ఇబ్బందులు పెడుతున్నారన్నారు. మూడు రాజధానుల ప్రక్రియ వెంటనే ప్రారంభం అయి ఉంటే ఈ పాటికే మంచి ఫలితాలు కనబడేవన్నారు. శ్రీభాగ్ ఒప్పందం స్పూర్తితో పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు తీసుకువచ్చామన్నారు. ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటున్న కారణంగానే గడచిన రెండున్నరేళ్లలో జరిగిన అన్ని ఎన్నికల్లో గెలవడం జరిగిందన్నారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుపై పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహనం కల్పించి, పూర్తి సమగ్రమైన మెరుగైన బిల్లును సభ ముందుకు తీసుకువస్తామని సీఎం జగన్ అన్నారు. విస్తృత విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు.