YS Jagan : పోలవరం Polavaram ప్రాజెక్టు కీలక పనులపై ఏపి సీఎం వైఎస్ జగన్ YS Jagan నేడు అధికారులతో సమీక్ష జరిపారు. స్పిల్ వే, అప్రోచ్ ఛానల్, అప్ స్ట్రీం కాఫర్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్, గేట్లు అమరిక తదితర కీలక పనులపై అధికారులతో జగన్ సమీక్షించారు అనంతరం జగన్ మాట్లాడుతూ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. కాఫర్ డ్యామ్ పనులు మే నెల చివరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. పోలవరం నిర్మాణాల్లో గత ప్రభుత్వ తప్పిదాల వల్ల ఇబ్బందులు ఎర్పడ్డాయన్నారు. స్పిల్ వే పనులు పూర్తి అయ్యాయనీ, గేట్లు, సిలిండర్ల బిగింపు పనులు చురుగ్గా జరుగుతున్నాయని అధికారులు జగన్ కు వివరించారు. అప్రోచ్ ఛానల్ పనులతో పాటు కాఫర్ డ్యామ్ లో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలని జగన్ ఆదేశించారు. ఇది జరిగితే వరద నీటిని స్పిల్ వే మీదుగా పంపే అవకాశం ఉంటుందన్నారు. మే నెలాఖరు నాటికి కాఫర్ డ్యామ్ పనులు పూర్తి అవుతాయని అధికారులు వివరించారు.
ఇదే సందర్భంలో సహాయ పునరావాస కార్యక్రమాలపై కూడా సీఎం జగన్ సమీక్ష జరిపారు. కాగా పోలవరం ఎత్తు తగ్గింపుపై జరుగుతున్న అసత్య ప్రచారంపైనా సమావేశంలో చర్చకు వచ్చింది. అసలు అలాంటి అవకాశమే లేదని అధికారులు తెలియజేశారు. ఎత్తు తగ్గింపు లేదని సీడబ్ల్యుసీ ఇంతకు ముందే చెప్పేసిందనీ, ఆ చర్చలు, ప్రతిపాదనలు అసంబద్ధమని సీడబ్ల్యుసీ, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖలు స్పష్టంగా చెప్పాయని అధికారులు పేర్కొన్నారు. నిర్ధేశించిన ఎత్తుకు అనుగుణంగా షట్టర్లు బిగింపు పూర్తవుతోందని అధికారులు తెలిపారు. నదుల అనుసంధానంపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను జగన్ ఆదేశించారు. పోలవరం వద్ద జి హిల్ సైట్ పై వంద అడుగుల వైఎస్ఆర్ విగ్రహం, వైఎస్ఆర్ గార్డన్స్ మాస్టర్ ప్లాన్ ప్రతిపాదన గురించి అధికారులు జగన్ కు వివరించారు. అయితే పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా డిజైన్లు రూపొందించాలని జగన్ సూచించారు.