చంద్రబాబు chandra babu హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహించిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు ab venkateswara rao కు అరెస్టు భయం పట్టుకుందా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఐపిఎస్ IPS అధికారుల సంఘానికి ఆయన రాసిన లేఖ ఇందుకు తార్కాణంగా కనబడుతోంది. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహనరెడ్డి YS jagan mohan reddy అధికారంలోకి వచ్చిన తరువాత ఏబి వెంకటేశ్వరరావును అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే వెంకటేశ్వరరావు తన సస్పెన్షన్పై క్యాట్ ను ఆశ్రయించగా ఊరట లభించలేదు. ప్రభుత్వ చర్యలను క్యాట్ సమర్ధించింది. అనంతరం ఏబి వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించగా సస్పెండ్ ఉత్తర్వులను రద్దు చేస్తూ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, పెండింగ్ జీతాలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వం.. హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేసింది. సుప్రీం కోర్టు ప్రభుత్వ అప్పీల్ పై స్టే ఇచ్చింది. దీంతో ప్రభుత్వం.. వెంకటేశ్వరరావును విధుల్లోకి తీసుకోలేదు. జీతాలు చెల్లించలేదు. ఏబివీ ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది.
అయితే ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరా వు ఐపిఎస్ అధికారుల సంఘానికి లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఏపి ప్రభుత్వం తనపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు కుట్ర పన్నుతోందని ఎబివి లేఖలో పేర్కొన్నారు. త్వరలోనే క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేసి జ్యూడిషియల్ రిమాండ్ కు పంపి మళ్లీ సస్పెన్షన్ ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వం చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు తన వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే తనకు నెలల తరబడి ఉద్యోగం చేయనీవ్వకుండా, జీతం ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తుందని ఎబివి వెంకటేశ్వరరావు విమర్శించారు. వెంటనే ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ ఏర్పాటు చేయాలని ఎబివి కోరారు. జనరల్ బాడీ ఏర్పాటు చేస్తే అన్ని విషయాలు ఆధారాలతో సహా వివరిస్తానని ఆయన పేర్కొన్నారు. తనపై విచారణ నిష్పక్షపాతంగా జరగాలన్నదే తన డిమాండ్ అని ఎబివి తన లేఖలో వివరించారు.