Atchannaidu: ఆంధ్ర, తెలంగాణ సరిహద్దులలో మళ్లీ వాహనాల నిలిపివేతతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు సరిహద్దుల వద్ద ఈ రోజు నుండి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. దీంతో సరిహద్దు చెక్ పోస్టుల వద్ద పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.
కర్ఫ్యూ మినహాయింపు వేళల్లో ఉదయం 6 గంటల నుండి పది గంటల మధ్యలోనూ అనుమతించకపోవడంతో వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కర్ప్యూ సమయంలో తాము వెళ్లడం లేదనీ రోజు మాదిరిగా వెళుతున్నా ఈ కొత్త ఆంక్షలు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ పాస్ ఉన్న వారినే అనుమతిస్తామంటూ తెలంగాణ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఈ పాస్ లేని వాహనాలను వెనక్కి పంపుతున్నారు. అంబులెన్స్, అత్యవసర వాహనాలను మాత్రం అనుమతి ఇస్తున్నారు.
రాష్ట్ర సరిహద్దుల వద్ద వాహనాల నిలిపివేతపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ఘాటుగా స్పందిస్తూ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ప్రతి సారి ఏమిటీ పంచాయతీలు అని ప్రశ్నించారు. పొందుగుల వద్ద వాహనదారులపై పోలీసులు మళ్లీ లాఠీ చార్జి చేస్తున్నారని వార్తలు వచ్చాయన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి ప్రజల బాగోగులు పట్టవా అని నిలదీశారు. రాష్ట్ర ప్రజల ఆవేదన చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లుగా ఉందని అన్నారు. భారతదేశంలో తెలంగాణ అంతర్భాగం కాదా అని అచ్చెన్న ప్రశ్నించారు. అక్కడ ఏమైనా ప్రత్యేక చట్టాలు అమలు అవుతున్నాయా అని అడిగారు. ప్రజల ప్రాణాలతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెలగాటం ఆడుతున్నారని దుయ్యబట్టారు.
కనీసం మానవతాదృక్పదంతో వారు వ్యవహరించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. మంత్రులనో, అధికార పార్టీ ఎమ్మెల్యేలనో రాష్ట్ర సరిహద్దుల వద్ద ఆపితే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. ఇరు రాష్ట్రాల సమన్వయానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అచ్చెన్న విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సరిహద్దుల్లో ఆంధ్ర ప్రాంత వాహనదారులు పడుతున్న ఇబ్బందులపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.