పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై కొందరు దుండగులు దాడి చేశారు. తన స్వగ్రామమైన అలవలలో బాలకోటిరెడ్డి మార్నింగ్ వాక్ కు బయలుదేరిన సమయంలో దుండగులు గొడ్డళ్లతో దాడి చేసి పరారైయ్యారు. తీవ్ర రక్తపు గాయాలతో పడిపోయిన ఆయనను వెంటనే స్థానికులు నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. బాలకోటిరెడ్డి రెడ్డి గతంలో రొంపిచర్ల ఎంపీపీగా పని చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ దాడి చేసింది ఎవరు..? దాడికి గల కారణాలు ఏమిటి..? అనేది పోలీసులు విచారణలో తేలాల్సి ఉంది అయితే టీడీపీ నేతలు మాత్రం ఈ దాడికి పాల్పడింది వైసీపీ నేతలేనని అరోపిస్తున్నారు. ఈ ఘటనలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
జగన్ రెడ్డి ప్రోత్సహం ఉంది కాబట్టే వైసీపీ రౌడీలు ఇలా రెచ్చిపోతున్నారు
ఈ ఘటనను టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, అచ్చెన్నాయుడు తదితర టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఉదయాన్నే వాకింగ్ కు వెళ్లిన వ్యక్తిపై గొడ్డళ్లతో దాడి చేశారంటే ఏపిలో శాంతి భద్రతల రక్షణ వ్యవస్థలు ఎం చేస్తున్నాయి.. నిద్రపోతున్నాయా అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు చంద్రబాబు. టీడీపీ కార్యకర్తలు, నేతల హత్యలకు జగన్ రెడ్డి ప్రోత్సహం ఉంది కాబట్టే వైసీపీ రౌడీలు ఇలా రెచ్చిపోతున్నారని విమర్శించారు చంద్రబాబు. పోలీసులను ఈ విషయంలో కల్పించుకోవద్దని జగన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారా.. లేకపోతే ఇలాంటివి జరుగుతుంటే వారెందుకు చేతులు ముడుచుకుని కూర్చుంటారు అని చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ వైపు నుండి కూడా ప్రతీకార చర్యలు ఉంటే వాటికి ఎవరు బధ్యతల తీసుకుంటారు.. జగన్ తీసుకుంటారా.. లేక పోలీసులా.అని ప్రశ్నించారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య ఉన్న బాలకోటిరెడ్డికి ఎం జరిగినా దానికి జగన్ రెడ్డే సమాధానం చెప్పాలన్నారు చంద్రబాబు.
లోకేష్ ఆగ్రహం
రొంపిచర్ల ఘటనను పురస్కరించుకుని సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు నారా లోకేష్. రాజకీయ ఆధిపత్యం కోసం చేస్తున్న హత్యలు, దాడులు మీ పతనానికి కారణమవుతాయన్నారు. ప్రజా వ్యతిరేకత తీవ్రం కావడంతోనే టీడీపీ క్యాడర్ ను హత్యలు చేసి భయపెట్టాలనుకుంటున్నారని లోకేష్ మండిపడ్డారు. బాలకోటిరెడ్డి పై హత్యాయత్నం వైసీపీ గుండాలపనేనని లోకేష్ ఆరోపించారు. వైసీపీ రౌడీ మూకలు ఎంతగా బరితెగించాయో తెలిసిపోతుందని అన్నారు. దాడిలో ఏకంగా వైసీపీ ఎంపీపీ భర్త పాల్గొన్నాడంటే ఎంత బరితెగించారో ఇట్టే అర్ధమవుతుందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లడ్ లోనే ప్యాక్షన్ మనస్థత్వం ఉన్న జగన్ పాలనలో పల్నాడు ప్రాంతం రక్తసిక్తమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. హత్యారాజకీయాలు మానుకోకుంటే ఇంతకు నాలుగింతలు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని లోకేష్ హెచ్చరించారు.