Auto Driver: గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఓ దారుణ ఘటన జరిగింది. ఇచ్చిన బాకీ అడిగినందుకు మహిళ అనే కనికరం లేకుండా ఓ ఆటో డ్రైవర్ కాలితో తన్నాడు. ఈ ఘటనతో మహిళ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ప్రస్తుతం బాదితురాలు మంగళగిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గుంటూరు జిల్లా చిర్రావూరుకు చెందిన గోపీకృష్ణ గతంలో తాడేపల్లి మహానాడులో తాపీ మేస్త్రిగా పని చేసేవాడు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఉండే గోవర్థని అనే మహిళ అతనికి రూ.3లక్షలు వడ్డీకి అప్పు ఇప్పించింది. తరువాత ఈ మహిళ మహానాడు నుండి విజయవాడ రాణిగారి తోటకు తన నివాసాన్ని మార్చుకుంది. గోపీ కృష్ణ తాపి మేస్త్రి పని వదిలివేసి ఆటో తోలుకుంటున్నాడు. గోవర్ధిని పలు మార్లు గోపి కృష్ణను అప్పు గురించి అడుగుతున్నా చెల్లించడంలేదు. దీంతో గోపి స్వగ్రామం చిర్రావూరు వెళ్లి బాకీ తీర్చాలని నిలదీసింది.
ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన గోపి గోవర్థిని పొత్తికడుపులో కాలితో బలంగా తన్నాడు. దీంతో ఆమె రోడ్డు పక్క కుప్పకూలిపోయింది. కొద్దిసేపటికి గోవర్థని 100 నంబర్ కు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం గాయపడిన ఆమెను మంగళగిరి ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గోపీకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహిళ అనే కనికరం లేకుండా పొత్తికడుపులో బలంగా తన్నిన ఆటో డ్రైవర్ ను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.