Anandaiah Medicine: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆనందయ్య మందు వ్యవహారంపై అటు అధికార పార్టీ, అటు ప్రతిపక్ష పార్టీలు స్పందిస్తున్నాయి. అధికారుల శాస్త్రీయ పరిశీలన నేపథ్యంలో ప్రభుత్వ అనుమతి వచ్చే వరకూ పంపిణీ నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే. తక్షణం మందు పంపిణీ చేయాలని కొందరు, శాస్త్రీయత రుజువు అయ్యిన తరువాత పంపిణీ మొదలు పెట్టాలని కొందరు పేర్కొంటున్నారు. మరో పక్క వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సైతం ఈ ఆనందయ్య మందుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి దీనిపై అధికారులతో దీనిపై సమీక్ష జరిపారు. నిపుణుల బృందం పరిశీలన నివేదిక వచ్చిన తరువాత మందు పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
మరో పక్క ఆనందయ్య ఆయుర్వేద ఔషదంపై ఏపి ఆయుష్ కమిషన్ పరిశీలన పూర్తి అయ్యింది. ఆయుష్ ప్రతినిధుల సమక్షంలో ఆనందయ్య మందు తయారు చేసి చూపించారు. దీనిపై ఆయుష్ కమిషనర్ కల్నర్ రాములు స్పందిస్తూ ఆనందయ్య పంపిణీ చేస్తున్న మందును ఆయుర్వేద మందులుగా గుర్తించలేమని వీటిని నాటు మందులుగా గుర్తిస్తున్నట్లు తెలిపారు. ఈ మందుల్లో హానికారకాలు ఏమీ లేవన్నారు. ఆనందయ్య వంశపారంపర్యంగా నాటు మందులు పంపిణీ చేస్తున్నారని అన్నారు.
పచ్చ కర్పూరం, పసుపు, నల్లజీలకర్ర, వేప ఇగురు, మారేడు ఇగురు, ఫిరంగి చెక్క, దేవరబండి వంటి మొక్కల ముడి పదార్ధాలతో మందులు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఆనందయ్య తనకు ఉన్న అనుభవంతో పిడికిలితో ఈ పదార్ధాలను కలిపి పౌడర్ తయారు చేస్తున్నారని కమిషనర్ రాములు పేర్కొన్నారు. ఆనందయ్య మందు రోగులపై పని చేస్తుందా లేదా అనేది ఆయుర్వేద వైద్యుల బృందం తేల్చుతుందని రాములు వెల్లడించారు. వైద్యుల బృందం పరిశీలన నివేదికను సీసీఆర్ఎఎస్ కు పంపుతుందన్నారు. అన్ని నివేదికలు వచ్చిన తరువాత మందు పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని రాములు వెల్లడించారు.
కాగా ఆనందయ్య మందు కోసం వేలాదిగా కృష్ణపట్నం గ్రామానికి జనాలు వస్తుండటంతో గ్రామంలో 144 సెక్షన్ విధించారు. ప్రభుత్వ అనుమతి వచ్చిన తరువాత మందులు ఉచితంగా పంపిణీ చేస్తామని ఆనందయ్య ప్రకటించారు.