Badvel By Poll: కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు అక్టోబర్ 30వ తేదీ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి గురువారం ఉప ఎన్నికలకు సంబంధించి నేతలకు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య భర్య కూడా డాక్టరేననీ, తమ పార్టీ తరపు నుంచి ఆమెను అభ్యర్థిగా నిలబెడుతున్నామన్నారు. బద్వేల్ నియోజకవర్గ అభ్యర్ధి డాక్టర్ దాసరి సుధ గెలుపు బాధ్యతలన్నీ సమావేశానికి వచ్చిన వారందరిపై ఉన్నాయన్నారు. నామినేషన్ కార్యక్రమానికి అందరూ హజరు కావాలని సూచించారు.
ఓటింగ్ శాతం గతం కంటే పెరగాలి
2019 ఎన్నికల్లో వెంకట సుబ్బయ్యకు దాదాపు 44వేలకుపైగా ఓట్ల మెజార్టీ వచ్చిందనీ ఇప్పుడు నాడు వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ డాక్టర్ సుధకు రావాలని అన్నారు. విజయం సాధిస్తామన్నఅతి విశ్వాసం ఉండకూడదనీ, కష్టపడి ప్రజల ఆమోదాన్ని పొందాలని పేర్కొన్నారు జగన్. 2019లో 77 శాతం ఓటింగ్ జరిగిందనీ, ఈ సారి ఓటింగ్ శాతం అంతకంటే పెరగాలన్నారు. అందరూ ఓట్లు వేసేలా ఓటర్లను ప్రోత్సహించాలన్నారు. ప్రతి సామాజిక వర్గాన్ని కలుపుకుని పోవాలని నేతలకు సూచించారు. ప్రతి మండలానికి బాధ్యులకు అప్పగించాలనీ, గ్రామ స్థాయి నాయకులతో కలిపి ప్రచారం నిర్వహించాలని తెలిపారు. ప్రతి ఇంటికి కనీసం మూడు నాలుగు సార్లు వెళ్లి వారిని అభ్యర్థించాలని జగన్ సూచించారు.
Read More: Cine Politics: చక్రం తిప్పిన చిరు..!? సినీ రాజకీయంతో పవన్ ఏకాకి..!!
Badvel By Poll: బద్వేల్ ఉప ఎన్నికల పార్టీ ఇన్చార్జిగా పెద్దిరెడ్డి
ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసేలా వారిని చైతన్యపర్చాలన్నారు, నెల రోజుల పాటు నాయకులు తమ సమయాన్ని కేటాయించి ఎన్నికలపై దృష్టి పెట్టాలని చెప్పారు. బద్వేల్ ఉప ఎన్నికకు పార్టీ ఇన్చార్జిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉంటారని తెలిపారు. వచ్చే సోమవారం నుండి పార్టీ తరపున కార్యక్రమాలు ప్రారంభించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం వల్ల ప్రజలకు ఎలాంటి మేలు జరిగిందో తెలియజేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం నిర్దేశించారు. సమావేశంలో అభ్యర్ధి డాక్టర్ దాసరి సుధ, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, మంత్రులు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామంచంద్రారెడ్డి, విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తో సహా పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.