Badvel Bypoll: కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే పిఎమ్ కమలమ్మను ఏఐసీసీ ప్రకటించినట్లు పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ ప్రకటన విడుదల చేశారు. ఏపితో సహా హిమాచల్ ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ లో జరుగుతున్న ఉప ఎన్నికల అభ్యర్థులను ఖరారు చేస్తూ ఏఐసీసీ నేడు ప్రకటన విడుదల చేసింది.
Badvel Bypoll: పోటీ నుండి తప్పుకున్న జనసేన, టీడీపీ
బద్వేల్ ఉప ఎన్నికలకు ఈ నెల 1వ తేదీన నోటిఫికేషన్ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ నెల 30వ తేదీన పోలింగ్, నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరగనున్నది. వైసీపీ తమ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్ దాసరి సుధను ప్రకటించిన నేపథ్యంలో మానవతా దృక్పతంతో జనసేన, టీడీపీ ఉప ఎన్నికలో అభ్యర్థిని పోటీకి నిలపడం లేదని ప్రకటించాయి. టీడీపీ తొలుత గతంలో పోటీ చేసి ఓడిపోయిన ఓబులాపురం రాజశేఖర్ ను అభ్యర్థిగా ప్రకటించింది. అయితే జనసేన తమ అభ్యర్థిని పోటీ చేయడం లేదని ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు పొలిట్ బ్యూరో సమావేశం ఏర్పాటు చేసిన నేతల అభిప్రాయాల మేరకు పోటీ నుండి విరమించుకున్నట్లు ప్రకటించారు. బీజేపీ మాత్రం వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమని పేర్కొంటూ పోటీలో ఉంటామని ప్రకటించింది. టీడీపీ, జనసేన పోటీ చేయకపోయినా కాంగ్రెస్, బీజేపీ పోటీ చేస్తున్న నేపథ్యంలో వైసీపీకి ఏకగ్రీవం అయ్యే అవకాశాలు మృగ్యమైయ్యాయి. బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. నవతరం పార్టీ అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేశారు. మరో పక్క బద్వేల్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ అభ్యర్థి దాసరి సుధ ముందంజలో ఉన్నారు. వైసీపీ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి బద్వేల్ ఉప ఎన్నికల బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. మంత్రి పెద్దిరెడ్డి నేతృత్వంలో ఆయనతో సహా ముగ్గురు మంత్రులు, ఇద్దరు పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు ప్రచార బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి ఏవరంటే..
మూడు దశాబ్దాల పాటు అధ్యాపకురాలిగా పని చేసిన పిఎం కమలమ్మ 2009 ఎన్నికలకు ముందు స్వచ్చంద పదవీ విరమణ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో బద్వేల్ నుండి పోటీ చేసి 36,590 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2014 నుండి 2017 వరకూ జాతీయ ఎస్సీ కమిషన్ లో సభ్యురాలిగా పని చేశారు. ఏఐసీసీ సభ్యురాలిగా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కోఆర్డినేషన్ కమిటీ మెంబర్ గా, 2019 ఎన్నికల్లో మేనిఫెస్టో కమిటీ సభ్యురాలిగా ఉన్నారు.