Badvel Bypoll: ఏపిలో అందరి చూపు బద్వేల్ ఉప ఎన్నిక వైపే ఉంది. వైసీపీ అధికారం చేపట్టిన రెండేళ్ల తరువాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఉప ఎన్నిక కావడం, అదీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సొంత జిల్లాలో కావడంతో ఆసక్తిగా గమనిస్తున్నారు. దివంగత వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్ దాసరి సుధనే వైసీపీ ఎన్నికల బరిలో నిలపడంతో సంప్రదాయాన్ని అనుసరించి జనసేన పోటీ చేయడం లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించడంతో టీడీపీ కూడా అదే బాట ఎంచుకుంది. తాము పోటీ చేయడం లేదని ప్రకటించింది. జనసేన పోటీ చేయడం లేదని ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ రంగంలోకి దిగింది. బీజేపీ యువమోర్చా నాయకుడు పనతాల సురేష్ ను ఎన్నికల బరిలో నిలిపింది. కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ ఎమ్మెల్యే పిఎమ్ కమలమ్మ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
Badvel Bypoll: జనసేన కీలక నిర్ణయం
అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే సిద్ధాంతపరమైన నిర్ణయం అంటూ జనసేన తమ అభ్యర్థిని పోటీకి నిలపలేదు. మరో పక్క ఇప్పుడు బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చే విషయంలో కీలక నిర్ణయాన్ని తీసుకుంది జనసేన. బీజేపి తమ మిత్ర పక్షం కావడం వల్ల ఎన్నికల ప్రచారంలో జనసైనికులు పాల్గొంటారని జనసేన ప్రకటించింది. తమ భాగస్వామ్య పక్షం అయిన బీజేపీ అభ్యర్థి తరపున ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించడం గమనార్హం. బీజేపీ – జనసేన పార్టీలు ఏపిలో పొత్తులో ఉన్నాయని పేర్కొన్న మనోహర్ రాబోయే రోజుల్లోనూ అదే విధంగా ముందుకు వెళతామని స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా బీజేపీ – జనసేన మిత్ర బంధానికి బీటలు వారుతున్నాయనీ, జనసేన బీజేపీ నుండి పక్కకు జరుగుతోందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నాదెండ్ల మనోహర్ రాబోయే రోజుల్లోనూ తమ పొత్తు కొనసాగుతుందంటూ వ్యాఖ్యానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక బద్వేల్ బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చే విషయంలో ఎలా నాదెండ్ల మనోహర్ ఎలా కవర్ చేసుకున్నారంటే… బద్వేల్ ఉప ఎన్నికల బరిలో అభ్యర్థిని నిలపకపోవడం తమ పార్టీ సిద్ధాంతపరమైన నిర్ణయం అట. అయితే మిత్ర పక్షం బీజేపీ అభ్యర్థిని నిలబెట్టింది కాబట్టి ప్రచారంలో పాల్గొనడం పార్టీ మిత్ర ధర్మం అని వివరణ ఇచ్చారు నాదెండ్ల మనోహర్. అయితే జనసేన తీసుకున్న ఈ నిర్ణయంపై ఆక్షేపణలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయ నాయకుల రెండు నాలుకల ధోరణికి ఇది నిదర్శనమంటూ కూడా కామెంట్స్ వస్తున్నాయి.
Read More: KCR: వెంకయ్యనాయుడు కుర్చీలో కేసీఆర్..? బీజేపీ ప్రతిపాదనకు కేసిఆర్ సమాధానమేమిటంటే..?
పవన్ కల్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపిన సోము వీర్రాజు
ఇక బద్వేల్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి జనసేన మద్దతు తెలియడంపై ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం స్పందించింది. పార్టీ అభ్యర్థి పణతాల సురేశ్ కు మద్దతుగా జనసైనికులు పని చేస్తారని తమ మిత్ర పక్షం జనసేన ప్రకటించిందనీ, దీన్ని తాము స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. ఈ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు. ఏపి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి కూడా జనసేన నేతలకు కృతజ్ఞతలు తెలియజేశారు.