Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతోంది. మంగళవారం కర్నూలు జిల్లా హాలహర్వి నుండి ప్రారంభమై ఆలూరు,, హులేబీడు, మనేకుర్తి మీదుగా ఆదోని మండలం శేగి గ్రామం వరకూ కొనసాగింది. పాదయాత్ర లో ఏపి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసిరెడ్డి, ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ జేడి శీలం, పార్టీ సీనియర్ నేత కొప్పుల రాజు తదితరులు పాల్గొన్నారు. రాహుల్ యాత్ర జయప్రదం చేసేందుకు పార్టీ నేతలు జన సమీకరణ చేశారు. వందలాది మంది జనాలు పాల్గొన్నారు.
కాగా జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీని అమరావతి జేఏసీ నేతలు, పోలవరం నిర్వాసిత రైతులు కలిశారు. ఏపికి ఏకైక రాజధాని అమరావతి కొనసాగేలా చూడాలంటూ రాహుల్ గాంధీకి వినతి పత్రం సమర్పించారు. దీనిపై రాహుల్ స్పందిస్తూ ఏపికి అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలనీ, అమరావతి రైతుల పోరాటానికి తాను సంఘీభావం తెలుపుతున్నానన్నారు. రైతుల పోరాటానికి న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నిర్వాసితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.