Chandrababu: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమా నేడు విడుదల అయిన సంగతి తెలిసిందే. పొరుగు రాష్ట్రం తెలంగాణలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అయిదు షోలకు అనుమతులు ఇవ్వడంతో పాటు టికెట్ ధర పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఏపిలో మాత్రం ప్రభుత్వం సినిమా థియేటర్ల యాజమాన్యాలకు ఆంక్షలు విధించింది. బెనిఫిట్ షోకు అనుమతి లేదనీ, ఎక్కువ ధరలకు టికెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ముందుగానే అధికారులు థియేటర్ల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే సినిమా టికెట్ల ధరల పెంపుపై ప్రభుత్వం నియమించిన కమిటీ ధరల పెంపునకు సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వానికి సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇంకా ప్రభుత్వం జీవో విడుదల చేయలేదు. రాష్ట్రంలో భీమ్లానాయక్ సినిమా విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ సంచలన కామెంట్స్ చేశారు.
Chandrababu: ఏ వ్యవస్థను జగన్ వదలడం లేదు
భీమ్లానాయక్ సినిమా విషయంలో సీఎం జగన్ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ఏ వ్యవస్థను జగన్ వదలడం లేదని అన్నారు. చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తులను టార్గెట్ గా పెట్టుకుని వ్యవస్థను నాశనం చేస్తున్న ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. భారతీ సిమెంట్ రేటుపై లేని నియంత్రణ భీమ్లానాయక్ సినిమాపై ఎందుకు అని ప్రశ్నించారు చంద్రబాబు. ప్రపంచ స్థాయికి వెళ్లిన తెలుగు సినిమాను తెలుగు రాష్ట్రంలో వేధిస్తున్న జగన్ .. తన మూర్ఘపు వైఖరిని వీడాలని హితవు పలికారు.
Chandrababu: ప్రజా సమస్యలు అన్నీ పక్కన పెట్టి..
రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలు అన్నీ పక్కన పెట్టి..థియేటర్ల దగ్గర రెవెన్యూ ఉద్యోగులను కాపలా పెట్టిన ప్రభుత్వ తీరు తీవ్ర అభ్యంతరకరమని అన్నారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న తమ వారిని రక్షించుకునేందుకు దేశంలో అన్ని రాష్ట్రాలు ప్రయత్నం చేస్తుంటే.. ఏపి సీఎం మాత్రం భీమ్లానాయక్ పై కక్షసాధింపు చర్యల్లో బిజీగా ఉన్నారని విమర్శించారు చంద్రబాబు. తెలుగు దేశం తప్పును ఎప్పుడూ ప్రశ్నిస్తుంది, నిలదీస్తుందని పేర్కొన్నారు. భీమ్లానాయక్ విషయంలో వేధింపులు వెంటనే విరమించుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.