Akhila Priya : తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు బ్యాడ్ టైం కొనసాగుతోంది. ఇప్పటికే బోయిన్పల్లి కిడ్నాప్ కేసులు ఆమె జైలు పాలయి బెయిల్ పై విడుదల అవడం , మరో వైపు ఆమె భర్త భార్గవ్ రామ్ ఇంకా పరారీలో ఉండటం వంటివి కొనసాగుతున్న తరుణంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆమెకు ఊహించని షాక్ ఇచ్చింది.
కర్నూలు జిల్లా విజయ డెయిరీ చైర్మన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జయకేతనం ఎగురవేసింది. దివంగత మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి సమీప బంధువు భూమా నారాయణరెడ్డి ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. భూమా కుటుంబ పాలనకు ఓటర్లు చరమగీతం పాడారు.
భూమా కుటుంబానికి ఇంకో షాక్
నంద్యాలలో జరిగిన కర్నూలు జిల్లా విజయ డెయిరీ చైర్మన్ ఎన్నికల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులయిన ముగ్గురు డైరెక్టర్లు భారీ మెజార్టీతో విజయం సాధించారు. 25 సంవత్సరాలుగా చైర్మన్గా కొనసాగుతున్న దివంగత మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి సమీప బంధువు భూమా నారాయణరెడ్డి ఓటమి పాలయ్యారు. కొత్తగా ఎన్నికైన ముగ్గురు డైరెక్టర్లు, పాత డైరెక్టర్లు నలుగురు.. వైఎస్సార్సీపీ మద్దతు దారుడు ఎస్వీ జగన్మోహన్రెడ్డికి మద్దతు తెలిపారు. దీంతో విజయ పాల డెయిరీ చైర్మన్గా ఎస్వీ జగన్మోహన్రెడ్డి ఎన్నికైనట్లు డెయిరీ ఎండీ ప్రసాదరెడ్డి ప్రకటించారు.
ఇప్పటికే ఇరుక్కుపోయిన భూమా కుటుంబం
ఇదిలాఉండగా కర్నూలు జిల్లా విజయ డెయిరీ చైర్మన్ గా ఉన్న సమయంలో భూమా నారాయణరెడ్డి భూమా నాగిరెడ్డి కుటుంబ సభ్యులపై సంచలన ఆరోపణలు చేశారు. `నిన్ను చంపితే కాని మాకు చైర్మన్ పోస్టు రాదు’ అని విజయ డెయిరీ చైర్మన్ భూమా నారాయణరెడ్డిని భూమా జగత్ విఖ్యాత్రెడ్డి, మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవరామ్ బెదిరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నంద్యాల తాలూకా పోలీసులు ఐపీసీ 448, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత ఏడాది నవంబరులో ఈ ఘటన జరిగింది.