బోయినపల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలిగా అరెస్టు అయిన ఏపి టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఎట్టకేలకు 18 రోజుల రిమాండ్ తరువాత చంచల్ గూడ జైలు నుండి బెయిల్ పై విడుదల అయ్యారు. భూమా అఖిలప్రియ జైలు నుండి బయటకు వచ్చిన తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించారనీ, ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి ధైర్యంగా ఉండాలని సూచించారని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ పరిణామం భూమా కుటుంబ అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించిందట. భూమా అఖిల ప్రియ అరెస్టు అయిన తరువాత ఆమెను గానీ కుటుంబ సభ్యులను గానీ పరామర్శించకుండా ఇప్పుడు ఫోన్ చేయడం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారుట.
ఐఎస్ఈ స్కామ్ లో అరెస్టు అయిన కింజరపు అచ్చెన్నాయుడు, మచిలీపట్నం హత్య కేసులో అరెస్టు అయిన కొల్లు రవీంద్ర, వాహనాల నకిలీ రిజిస్ట్రేషన్ కేసులో అరెస్టు అయిన జెసి ప్రభాకరరెడ్డి వంటి నాయకులను పరామర్శించి టీడీపీ నేతలు తమ నాయకురాలు విషయంలో టీడీపీతో అసలు సంబంధం లేని నాయకురాలిగా చూశారని ఆవేదన చెందుతున్నారుట. ఇంత చేసిన తరువాత చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని అఖిలప్రియ నమ్ముతారా అన్న మాటలు వినిపిస్తున్నాయి. కిడ్నాప్ కేసులో అఖిల ప్రియ అరెస్టు కంటే ఈ విషయంలో చంద్రబాబు, లోకేష్ ఖండించకపోవడం, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పకపోవడమే తమను ఎక్కువగా బాధించాయని భూమా వర్గీయులు అంటున్నారుట. 18 రోజుల పాటు కనీసం పలకరించకుండా ఇప్పుడు ఏ మోహం పెట్టుకుని ఫోన్ చేశారో అర్థం కావడం లేదని అంటున్నారు. ఇప్పటికైనా తమ నాయకురాలు ఎవరేమిటో అర్థం చేసుకుని భవిష్యత్తు రాజకీయాలపై సరైన నిర్ణయం తీసుకుంటుందని అఖిలప్రియ అభిమానులు అశాభావంతో ఉన్నట్లు తెలుస్తోంది.
బెయిల్ లభించిన వెంటనే పెద్ద ఊరేగింపుగా హైదరాబాద్ నుండి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు భూమా అఖిలప్రియను తీసుకురావాలని ఆమె అభిమానులు భావించినప్పటికీ హైదరాబాద్ విడిచి వెళ్లడానికి వీలులేదని కోర్టు షరతు విధించడంతో ఆ ప్రతిపాదన విరమించుకున్నారుట. కోర్టు షరతులు ఎత్తివేసిన తరువాత ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ అభిమానులతో సమావేశం నిర్వహిస్తారని ఆ తరువాత ఎలా వ్యవహరించాలన్నదానిపై నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.