Big Breaking: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి రామ్ సింగ్ కి ఏపి హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. రామ్ సింగ్ పై నమోదు చేసిన కేసులో హైకోర్టు స్టే ఇచ్చింది. కడప కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అధికిర రామ్ సింగ్ పై కడప రిమ్స్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. దర్యాప్తు అధికారిపై కేసు నమోదు చేయడం పట్ల సీబీఐ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. సీబీఐ న్యాయవాది వాదనలు విన్న న్యాయస్థానం తదనంతర చర్యలన్నింటిపై స్టే ఇచ్చింది. ఎలాంటి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
Big Breaking: ఉదయ్ కుమార్ రెడ్డి ఫిర్యాదుతో..
వివేకా హత్య కేసులో పలు మార్లు విచారణ ఎదుర్కొన్న పులివెందులకు చెందిన ఉదయ్ కుమార్ రెడ్డి ఇటీవల తనను సీబీఐ అధికారి రామ్ సింగ్ వేధింపులకు గురి చేస్తున్నారంటూ పోలీసులకు పిర్యాదు చేయడంతో పాటు కడప కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కడప కోర్టు ఆదేశాల మేరకు రిమ్స్ పోలీసులు సీబీఐ అధికారి రామ్ సింగ్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారిపైనే కేసు నమోదు కావడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. వివేకా కేసులో మొదటి నుండి అనేక ట్విస్ట్ లు చోటుచేసుకుంటున్నాయి. కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకున్న తరుణంలో సీబీఐ అధికారిపై పోలీసు కేసు నమోదు కావడం తీవ్ర చర్చనీయాంశమైంది.