Big Breaking : రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. అసైన్డ్ భూముల వ్యవహారానికి సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు చంద్రబాబు, నారాయణలపై ఏపి సీఐడి కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఏపి సీఐడి వారిని విచారణకు హజరుకావాలంటూ నోటీసులు జారీ చేసింది.
కాగా ఈ సిఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను సవాల్ చేస్తూ మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలు నిన్న హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా ఈ రోజు కోర్టు విచారణ జరిపింది. చంద్రబాబు తరపున సీనియర్ సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా, నారాయణ తరపున మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు.
చట్టాలపై, జీవోలపై దర్యాప్తు చేసే అధికారం పోలీసులకు లేదనీ, తమపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టాలంటే ఫిర్యాదు దారుడు దళితుడై ఉండాలనీ, ప్రభుత్వం కావాలనే కక్షసాధింపుతో తప్పుడు కేసులు పెట్టిందనీ, సీఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ సరికాదని చంద్రబాబు, నారాయణలు క్వాష్ పిటిషన్ లో పేర్కొన్నారు.
ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ భూషణ్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. సిఐడి విచారణపై స్టే ఇచ్చింది, దీంతో చంద్రబాబుతో సహా నారాయణకు ప్రస్తుత సీఐడి కేసులో విచారణకు హజరు కావాల్సిన పని లేకుండా ఊరట లభించింది.