Big Breaking ; రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం కొట్టేసింది. దీంతో ఎస్ఈసీ నీలం సాహ్ని తీసుకున్న నిర్ణయం నెగ్గినట్లు అయ్యింది. డివిజన్ బెంచ్ లో వైసీపీకి ఊరట లభించింది.
రాష్ట్రంలో మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ ఈ నెల 1వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 8వ తేదీ పోలింగ్, పదవ తేదీ ఓట్ల లెక్కింపు నిర్వహణకు ఎస్ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. అయితే ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీలో సుప్రీం కోర్టు మార్గదర్శకాలు పాటించలేదంటూ జనసేన, బీజెపీ, టీడీపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. టీడీపీ నేత వర్ల రామయ్య దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ పై స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నోటిఫికేషన్ తదుపరి చర్యలను నిలుపుదల చేసింది.
సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎస్ఈసీ కార్యదర్శి కన్నబాబు మంగళవారం రాత్రి డివిజన్ బెంచ్కు ముందు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై బుధవారం ఉదయం ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎస్ఈసీ తరపున సీనియర్ న్యాయవాది మోహనరెడ్డి వాదనలు వినిపించారు. టీడీపీ నేత వర్ల రామయ్య తన పిటిషన్ ను పార్టీ తరపున దాఖలు చేయలేదనీ, వ్యక్తిగతంగా రిట్ పిటిషన్ వేశారని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. 28 రోజులు కోడ్ ఉండాలనేది సుప్రీం కోర్టు ప్రత్యేక సందర్భంలో ఇచ్చిందని పేర్కొన్నారు. కోడ్ నిబంధన ఈ ఎన్నికలకు వర్తింపజేయాల్సిన అవసరం లేదని మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
అయితే పిటిషన్ లో సరైన వివరాలు పొందుపర్చకపోవడంతో హైకోర్టు ఎస్ఈసీపై అసహనం వ్యక్తం చేస్తూ సరైన పత్రాలతో మధ్యాహ్నం కోర్టు ముందుకు రావాలని ఆదేశించింది. ధర్మాసనం ఆదేశాల మేరకు ఎస్ఈసీ నామినేషన్ కు సంబంధించి పత్రాలను సమర్పించగా విచారణ కొనసాగింది. సింగిల్ జడ్జి ఇచ్చిన అదేశాలను రద్దు చేయాలని ఎస్ఈసీ, ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోరారు. ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరాం, వర్ల రామయ్య తరపున వేదుల వెంకట రమణ వాదనలు వినిపించారు. వాదనల అనంతరం ఎస్ఈసీ వాదనలను సమర్థించిన ధర్మాసనం..సింగిల్ జడ్జి తీర్పును నిలుపుదల చేసింది. ఎస్ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్ ఆధారంగా పోలింగ్ నిర్వహించుకోవచ్చని తేల్చి చెప్పింది. అయితే తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ కౌంటింగ్ ప్రక్రియ చేపట్టవద్దని ఆదేశాలను జారీ చేసింది.