Big Breaking : తిరుపతి ఉప ఎన్నికలకు బీజేపీ అభ్యర్థిగా రిటైర్డ్ సీనియర్ ఐఎఎస్ అధికారిణి రత్నప్రభ పేరు పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. రత్నప్రభ గతంలో కర్నాటక రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిగా పని చేశారు. ఆమె పదవీ విరమణ అనంతరం బీజేపీలో చేరారు. తిరుపతి ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన నాటి నుండి రిటైర్డ్ ఐఎఎస్ లు దాసరి శ్రీనివాసులు, రత్న ప్రభ పేర్లు వార్తల్లోకి వచ్చాయి. అయితే ప్రచార సమన్వయ కమిటీలో దాసరి శ్రీనివాసులు పేరును బీజేపీ ప్రకటించడంతో ఇక రత్నప్రభకు ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయని అందరూ భావించారు. అందరూ ఊహించినట్లుగానే బీజెపీ – జన సేన ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభ పేరును పార్టీ అధిష్టానం ప్రకటించింది.
చాలా రోజుల క్రితమే టీడీపీ తమ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి పేరును ప్రకటించగా ఇటీవల వైసీపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. వైఎస్ఆర్ కుటుంబానికి విధేయుడైన ఫిజియోథెరఫీ డాక్టర్ గురుమూర్తిని వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు. నిన్ననే టీడీపీ అభ్యర్థిని పనబాక లక్ష్మి నామినేషన్ కూడా దాఖలు చేశారు.
తిరుపతి వైసీపీ ఎంపి బల్లి దుర్గాప్రసాద్ గత ఏడాది కరోనా కారణంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. తిరుపతి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
కాగా రత్నప్రభను పార్టీ అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆమెకు అభినందనలు తెలియజేశారు.