Big Breaking; రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ విజయాన్ని నిర్వహించిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఆ తరువాత పవన్ కల్యాణ్ ముఖ్య కార్యనిర్వహకులు, భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బంది ఎక్కువ మంది కరోనా బారిన పడ్డారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా వైద్యుల సూచనల మేరకు పవన్ కల్యాణ్ కూడా క్వారంటైన్ కు వెళ్లారు.
గత వారం రోజులుగా ఆయన పరివారంలోని ఒక్కరొక్కరు కరోనా బారిన పడుతూ వస్తున్నారు. వీరంతా పవన్ కల్యాణ్ కు చాలా సమీపంలో విధులు నిర్వహించారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా, కరోనా విస్తృతి నివారణ లో భాగంగా పవన్ కల్యాణ్ క్వారంటీన్ కు వెళ్లినట్లు జనసేన అధ్యక్షుల రాజకీయ కార్యదర్శి పి హరిప్రసాద్ ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. వైద్యుల సూచనల మేరకు పవన్ కల్యాణ్ ప్రశాంత వాతావరణంలో ఉంటున్నారని తెలిపారు. రోజు వారీ విధులను నిర్వహిస్తూనే పార్టీ కార్యక్రమాలను పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నాయకులతో మాట్లాడుతున్నారని హరిప్రసాద్ తెలియజేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ భద్రతా సిబ్బంది కరోనా బారిన పడ్డారని, ఆయన క్వారంటైన్ కు వెళ్లారని తెలియడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఓ పక్క పవన్ నటించి వకీల్ సాబ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావడంతో పాటు రికార్డు స్థాయి కలెక్షన్ సొంతం చేసుకుందన్న ఆనందంలో ఉన్న అభిమానులకు ఈ వార్త నిరుత్సాహాన్ని కల్గిస్తోంది.