Big Breaking: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ఇటీవల విచారణ జరిపి మద్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తుది తీర్పు బుధవారం ప్రకటిస్తానని ప్రకటించిన న్యాయస్థానం ఇవేళ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇంతకు ముందు బుధవారం వరకూ అరెస్టు చేయవద్దంటూ సీబీఐకి ఆదేశాలు ఇచ్చిన న్యాయస్థానం ఇవేళ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి సహకరించాలని ఆదేశించినట్లుగా తెలుస్తొంది. ముందస్తు బెయిల్ మంజూరులో పూర్తి షరతులు తెలియాల్సి ఉంది. ఇటీవల అవినాష్ రెడ్డి, సునీత రెడ్డి తరపు న్యాయవాదులు వాదనలు వినిపించిన అనంతరం మరుసటి రోజు సీబీఐ తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనిల్ వాదనలు వినిపించారు.
అవినాష్ కు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అవినాష్ రెడ్డిని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సి ఉందని హైకోర్టుకు సీబీఐ స్పష్టం చేసింది. అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు సహకరించడం లేదని, ఎన్ని సార్లు నోటీసులు ఇచ్చినా అవినాష్ రెడ్డి పట్టించుకోవడం లేదని కోర్టుకు తెలిపింది. కేసు దర్యాప్తులో అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారని సీబీఐ వెల్లడించింది. దర్యాప్తు తమ పద్దతి ప్రకారం చేస్తాము కానీ అవినాష్ రెడ్డి కోరుకున్నట్లు కాదని సీబీఐ తరపు న్యాయవాది అనిల్ కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంలో హైకోర్టు సీబీఐకి పలు ప్రశ్నలు సంధించింది.
హత్యకు అనేక ఉద్దేశాలు చెబుతున్నారు..? అవినాష్ రెడ్డి రాజకీయంగా అంత ప్రభావిత వ్యక్తి అయితే.. వివేకా ను చంపాల్సిన అవసరమేమిటి..? 2017 ఎన్నికలను మేనేజ్ చేసి ఉండొచ్చు కదా..! హత్య వరకూ వెళ్తారా..? భాస్కర్ రెడ్డి, ఉదయ్ రెడ్డి అరెస్టుకు కారణాలు ఏమిటి..? కస్టడీ విచారణలో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి ల నుండి ఏమి తెలుసుకున్నారు..? వివేకా మృతదేహం చూడగానే గాయాలు కనిపించాయా..? రక్తపు మరకలు తుడచడం ఎవిడెన్స్ టెంపర్ ఎలా అవుతుంది..? మృతదేహం చూస్తే మర్డర్ గా తెలుస్తుంది..? రక్తపు మరకలతో అవసరం లేదు కదా..! గాయాలు చూస్తే హత్య అని ఎవరైనా చెబుతారు కదా..! గదిలో రక్తం తుడిచేస్తే సాక్ష్యాలకు నష్టం ఏమిటి..? అంటూ ఇలా సీబీఐని హైకోర్టు ప్రశ్నించింది. వీటిపై సీబీఐ సమాధానం ఇచ్చింది.
వివేకా హత్య కు నెల రోజుల ముందే కుట్ర జరిగిందనీ, వివేకా హత్య రాజకీయ కోణాలతోనే జరిగిందని స్పష్టం చేసింది. అవినాష్ కుటుంబానికి వివేకాతో రాజకీయ విభేదాలు ఉన్నాయనీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమి వెనుక కుట్ర జరిగిందని తెలిపింది. కడప ఎంపీ టికెట్ విజయలక్ష్మి లేదా షర్మిలకు ఇవ్వాలని వివేకా అడిగారు. వివేకాపై రాజకీయంగా పై చేయి సాధించాలని అవినాష్ రెడ్డి భావించారు. కుట్ర లో ప్రమేయం దృష్ట్యా భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను అరెస్టు చేశాం, భాస్కర్ రెడ్డి, ఉదయ్ రెడ్డి విచారణకు సహకరించడం లేదు. హత్య కు గంగిరెడ్డి ద్వారా అవినాష్ రెడ్డి కుట్ర చేశారు. శివశంకర్ రెడ్డి, గంగిరెడ్డి ద్వారా హత్య కుట్ర అమలు చేశారు.
వివేకాపై కోపం ఉన్న వారిని గంగిరెడ్డి కుట్రలోకి లాగారు. శత్రువుకు శత్రువు మిత్రుడనే విధానం ఇక్కడ అమలు చేశారు. అవినాష్ రెడ్డి నుండే డబ్బులు వచ్చాయని దస్తగిరి స్టేట్ మెంట్ ఇచ్చారు. అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డికి ఇస్తే.. తను గంగిరెడ్డికి ఇచ్చారు. రూ.4కోట్ల ఖర్చు పెట్టడానికి శివశంకర్ రెడ్డికి ఏం అవసరం ఉంది. రూ.75 లక్షల్లో రూ.46 లక్షలు మున్నా లాకర్ నుండి స్వాధీనం చేసుకున్నాం. వివేకా గదిలో రక్తం కడిగేసి సాక్ష్యాలను చెరిపేశారు అంటూ ఇలా సీబీఐ తరపున సమాధానాలు చెప్పారు. సీబీఐ వాదనలు ముగిసిన తర్వాత తుది ఉత్తర్వులు బుధవారం వెల్లడిస్తామని పేర్కొని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన న్యాయమూర్తి ఇవేళ షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. దీంతో అవినాష్ రెడ్డికి బిగ్ రిలీఫ్ లభించినట్లు అయ్యింది. అయితే హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సీబీఐ సవాల్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. హైకోర్టు ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై సీబీఐ ఆలోచన చేసే అవకాశం ఉంది.
ఆ ఇద్దరు కీలక నేతల చూపు కాంగ్రెస్ వైపే ..? ఖరారు అవుతున్న మూహూర్తాలు..!!