Bezawada Durgamma Temple : విజయవాడ కనకదుర్గమ్మ వెలిసిన ఇంద్రకీలాద్రి కొండ కంటే ఆలయంలో జరిగిన అవినీతి పెద్దగా ఉంది. అన్ని విషయాల్లోనూ ఇక్కడి అధికారులు అవినీతికి అలవాటు పడిన అమ్మవారి సొమ్ము ఎంత మేర దోచుకున్నారు అన్నది ఇప్పుడు లెక్కలు బయటకు వస్తున్నాయి. కొద్దిరోజులుగా అవినీతి నిరోధక శాఖ అధికారులు దుర్గగుడిలో తీరిక లేకుండా అవినీతి లెక్కలను బయటకు తీయడం, దాని మీద ప్రభుత్వానికి కీలకమైన నివేదిక ఇవ్వడం ఇటు రాజకీయంగానూ చర్చను రాజేస్తోంది. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యేగా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రధాన కార్ గెట్ గా విపక్షాలు ఇప్పుడు విమర్శలు తీవ్రతరం చేస్తున్నాయి. మొదటి నుంచి దుర్గగుడి వ్యవహారాల్లో ఆయన పేరే బయటకు వస్తోంది. ఇక్కడ భారీగా అవినీతి జరిగిందంటూ జనసేన నాయకుడు పోతిన మహేష్ ఆధారాలతో సహా ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శలు గుప్పించారు. అంతకుముందే దుర్గగుడి వ్యవహారాలపై పూర్తిగా దృష్టి పెట్టిన ప్రభుత్వం ఏసీబీ ను రంగంలోకి దింపే మొత్తం ఆలయంలో జరిగిన అవినీతి మీద కీలకమైన నివేదికను అడిగింది. దీంతో అధికారులు మొత్తం లెక్కలన్నీ తేల్చి ఎక్కడెక్కడ ఏ పనుల్లో అవినీతి జరిగింది అన్న దానిమీద పూర్తి నివేదికను సమర్పించడానికి సిద్ధమయ్యారు.
సురేష్ బాబే కీలకం
ఏసీబీ అధికారులు ఈ విచారణను లోతుగా వెళ్లి దర్యాప్తు చేయడంతో కీలకమైన విషయాలు బయటపడినట్లు తెలుస్తోంది. ఆలయంలో సరుకుల కొనుగోళ్లు దగ్గర నుంచి సిబ్బంది నియామకం వరకు అన్ని విషయాల్లోనూ డబ్బులు భారీగా చేతులు మారినట్లు ఏసీబీ గుర్తించింది. ముఖ్యంగా ఏసీబీ నివేదికలో దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి, దేవాదాయ శాఖ కమిషనర్ దుర్గగుడి వ్యవహారాల్లో అవినీతికి పాల్పడ్డారని, ఈ వ్యవహారం అంతటికీ వెనక ఉన్నది ఆలయ కార్యనిర్వహణాధికారి సురేష్ బాబు అని స్పష్టంగా నివేదిక వెల్లడించిన ట్లు ప్రచారం జరుగుతోంది. ఆలయంలోని కీలకమైన రికార్డులు అన్ని స్వాధీనం చేసుకున్న ఎసిబి దీని మీద అన్ని ఆధారాలతో సహా ప్రభుత్వానికి సుమారు ఎనిమిది వందల పేజీలు పైగా నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది.
అన్ని విషయాల్లోనూ అవినీతే
ఆలయానికి సంబంధించి శానిటేషన్ టెండర్లు, మ్యాక్స్ సంస్థకు సెక్యూరిటీ టెండర్లలో నిబంధనలు ఏమీ పాటించలేదని ఇష్టానుసారం వారికి అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీని వెనక ఎవరి ప్రమేయం ఉన్నది ఎవరి ఒత్తిడి ఉన్నది అన్నది కూడా ఏసీబీ ఆరా తీస్తోంది. అమ్మవారికి భక్తులు సమర్పించే విలువైన చీరలు కూడా భారీగా గల్లంతు అయినట్లు గుర్తించారు. అలాగే ప్రసాదాల స్టోర్ లో సైతం భారీగా అవకతవకలు బయటపడ్డాయి. అమ్మవారి ఆలయం లో జరిగిన కీలక లావాదేవీలకు సంబంధించిన బిల్లులను కూడా ఏసీబీ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కృష్ణా-గుంటూరు జిల్లాలకు చెందిన మొత్తం 30 మంది కీలక అధికారులతో కూడిన బృందాలు ఆలయం మొత్తంమీద సోదాలు చేశాయి. వేదికలు అన్నీ సీజ్ చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నారు.
** సోదాల్లో అభివృద్ధి పనుల తాలూకా బిల్లులు, కాంట్రాక్టర్లకు చెల్లించిన వివరాలు, సరుకుల కొనుగోళ్ళు, చీరల విక్రయం, తలనీలాల టెండర్లు, సెక్యూరిటీ, అవుట్ సోర్సింగ్ సిబ్బంది జీతాలు చెల్లింపులు బిల్లులతో పాటు గతంలో ఫెర్రీ లో స్క్రాప్ విక్రయాలకు సంబంధించిన వివరాలను సైతం అధికారులు సేకరించారు. గతంలో పెళ్ళిలో ఉన్న స్క్రాప్ ను విక్రయించగా వచ్చిన సొమ్మును ఎక్కడ డిపాజిట్ చేశారనే వివరాలను ఆలయ అధికారులు చెప్పినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన 58 కోట్ల రూపాయలు చెల్లింపులు పైనే ఎక్కువగా అవినీతి జరిగినట్లు సమాచారం.
తరుచూ వివాదాలు
ఇటీవల కనకదుర్గమ్మ ఆలయం తరుచు వివాదాల్లో ఉంటుంది. అమ్మవారి వెండి రథం సింహాల ప్రతిమలు అదృశ్యమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తే, నిందితులను పట్టుకోవడంలో 4 నెలల సమయం పట్టడం కూడా పలు విమర్శలకు దారి తీసింది. అలాగే దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ప్రత్యేక దర్శనం టిక్కెట్లు ధర పెంచడం, నిబంధనలకు విరుద్ధంగా భక్తులను అనుమతించడం, ముందస్తు సమాచారం లేకుండా ఆలయానికి వచ్చిన వారికి బ్లాకులో టిక్కెట్లు విక్రయం చేయడం పైన విమర్శలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఏసీబీ దుర్గగుడిలో కీలకమైన ఆధారాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని పై భవిష్యత్తులో ఇంకేం ఆరోపణలు వస్తాయి అన్నది కూడా కీలకంగా మారింది.