ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గిన ఏపి సర్కార్ ఉచిత బియ్యం పంపిణీకి చర్యలు చేపడుతోంది. వచ్చే నెల ఆగస్టు నుండి పీఎంజీకేఏవై ఉచిత బియ్యం పంపిణీ చేయడానికి సన్నాహాలు చేస్తొంది. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి భారం పడకుండా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటి వరకూ పీఎంజీకేఏవై అయిదు విడతల ఉచిత బియ్యం రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులందరికీ పంపిణీ చేసిన ఏపి సర్కార్ .. ఆరవ విడత పంపిణీకి సంబందించి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుదారులకు మాత్రమే పంపిణీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులు సుమారు 60 నుండి 70 శాతం ఉన్నాయి. వీటికి మాత్రమే కేంద్రం ఉచిత బియ్యం సరఫరా చేస్తొంది. మిగిలిన కార్డు దారులకు పంపిణీ చేసే బియ్యానికి ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు భరిస్తొంది. ఈ కార్డులకు కూడా బియ్యం సరఫరా చేస్తేనే పంపిణీ చేస్తామని ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం పీఎంజీకేఏవై బియ్యం పంపిణీ చేపట్టలేదు.
మోడీ సర్కార్ ఇస్తున్న ఉచిత బియ్యం పంపిణీ చేయాలంటూ బీజేపీ నేతలు నిరసన కార్యక్రమాలు నిర్వహించడం, ఇటీవల కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా ఉచిత బియ్యం పంపిణీ చేస్తేనే ఏపి నుండి బియ్యం కొనుగోలు చేస్తామని ప్రకటించడంతో వచ్చే నెల నుండి ఉచిత బియ్యం పంపిణీకి సన్నాహాలు ప్రారంభిస్తొంది. రాష్ట్రంలో మొత్తంగా ఉన్న కార్డుదారులకు ఉచిత బియ్యం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం 20 నుండి 30 శాతం కార్డుదారుల బియ్యం పంపిణీకి అవసరమ్యే ఖర్చు భరించాల్సి వస్తుంది. కేంద్రం ఇస్తున్న బియ్యం ను కేవలం ఎన్ ఎఫ్ ఎస్ ఏ కార్డుదారులకు మాత్రమే పంపిణీ చేయనున్నారు. నాన్ ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీ చేయదు.
ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుదారులకు విఆర్ఓ, వాలంటీర్ల ద్వారా కూపన్లు పంపిణీ చేసి వాటి ద్వారా ఉచిత బియ్యం రేషన్ షాపుల్లో ఆగస్టు 1వ తేదీ నుండి పంపిణీ చేయనున్నారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకూ ఎండీయు వాహనాల ద్వారా రేషన్ కార్డుదారులకు కేజీ రూపాయి బియ్యం పంపిణీ చేస్తారు. సాయంత్రం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకూ రేషన్ షాపుల్లో ఉచిత బియ్యం ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుదారులకు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తొంది. ఈ నెలాఖరు లోగా వచ్చే నెల రేషన్ కోటాతో సహా ఉచిత బియ్యం అన్ని రేషన్ షాపులకు బియ్యం సరఫరా చేసే విధంగా చర్యలు చేపడుతున్నారు.