భర్తకు షాక్ ఇచ్చి, అధికారులను ముప్పుతిప్పలు పెట్టి ప్రియుడితో హాపీగా రాష్ట్రం దాటి చెక్కేసింది ఆ యువతి. ఆ యువతి ఎవరో కాదు విశాఖ ఆర్కే బీచ్ లో రెండు రోజుల క్రితం అదృశ్యమైన సాయిప్రియ. సాయి ప్రియ ఇచ్చిన ట్విస్ట్ కు భర్త శ్రీనివాస్ తో పాటు ఆమె కుటుంబ సభ్యులు, అధికారులు షాక్ అయ్యాయి. విషయంలోకి వెళితే.. సాయి ప్రియ, శ్రీనివాస్ భార్యభర్తలు. విశాఖ సంజీవ నగర్ లో ఉంటున్నారు. అయితే సాయిప్రియ కొంత కాలంగా శాంతినగర్ కు చెందిన రవితో ప్రేమాయణం సాగిస్తొంది. సోమవారం సాయిప్రియ, శ్రీనివాస్ ల పెళ్లి రోజు కావడంతో ఇద్దరు కలిసి ఆర్కే బీచ్ కి వెళ్లారు. ఈ సమయంలో భర్త శ్రీనివాస్ కళ్లు గప్పి ప్రియుడు రవితో సాయిప్రియ జంప్ అయ్యింది. భార్య కనిపించకపోవడంతో సముద్రంలో కొట్టుకుపోయి ఉంటుందని కంగారుపడి పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు శ్రీనివాస్. సాయి ప్రియ కోసం కోస్ట్ గార్డ్ షిప్ లతో పాటు ఓ హెలికాఫ్టర్ తో సముద్రం మొత్తం గాలించారు. గాలింపు చర్యల కోసం సుమారు కోటి రూపాయల వరకూ ఖర్చు అయినట్లు సమాచారం. హెలికాఫ్టర్ సాయంతో గాలింపు చేపట్టడంతో ఇంత భారీ స్థాయిలో ఖర్చు చేయాల్సి వచ్చినట్లు తెలుస్తొంది.
ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే …గల్లంతైనట్లు భావిస్తున్న సాయి ప్రియ తాను క్షేమంగా ఉన్నట్లు తల్లిదండ్రులకు సమాచారం ఇస్తూ తాను రవిని రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. తాళిబొట్టుతో ఉన్న ఫోటోను తల్లిదండ్రులకు వాట్సాప్ లో పంపించింది. అలాగే ఓ వాయిస్ మెసేజ్ పంపింది. “నాన్న .. నేను సాయిని మాట్లాడుతున్నాను. నేను చచ్చిపోలేదు. బతికే ఉన్నాను, నేను రవితోనే ఉన్నాను. నన్ను రవి బలవంతంగా తీసుకెళ్లలేదు. మా ఇద్దరికీ పెళ్లి కూడా అయిపోయింది. దయచేసి నా కోసం వెతకొద్దు నాన్న నీకు పుణ్యం ఉంటుంది. ఇంకా పరిగెత్తే ఓపిక నాకు లేదు. చావు అయినా బతుకైనా రవితోనే ఉంటాను. ప్లీజ్ మమ్మల్ని వెతకొద్దు. ఒక వేళ నా కోసం వెతికితే చనిపోతా. రవి పేరెంట్స్ ను ఏమీ చేయొద్దు” అంటూ వాయిస్ మెసేజ్ చేసింది. అయితే తొలుత సాయి ప్రియ నెల్లూరులో ప్రత్యక్షమైనట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయం అధికారులకు తెలియడంతో అక్కడ నుండి ప్రియుడు రవితో కలిసి బెంగళూరుకు వెళ్లినట్లు భావిస్తున్నారు.