భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి ప్రస్తుతం నేతృత్వం వహిస్తున్న మోడీ, షా ధ్వయం చేస్తున్న రాజకీయాలు గతానికి భిన్నంగా ఉంటాయి. ఉంటున్నాయి. రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి వారికి ఓట్లు, సీట్లతో పని లేదు. అధికారంలోకి రావడానికి అనైతిక మార్గాలను అనుసరిస్తున్నారనే ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. ఇంతకు ముందు పలు రాష్ట్రాల్లో మెజారిటీ స్థానాలు సాధించకపోయినా అధికారాన్ని హస్తగతం చేసుకున్న ఉదంతాలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలపడకుండా చేయడంతో పాటు ఆ పార్టీకి మద్దతుగా నిలిచే ప్రాంతీయ పార్టీలను ఏదో విధంగా నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తూ విజయం సాధిస్తొంది బీజేపీ. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో బలమైన పునాదులు వేసుకున్న బీజేపీ ఇక దక్షిణాది రాష్ట్రాల్లోనూ బలపడేందుకు వ్యూహాత్మక ఆడుగులు వేస్తొంది. ఆ క్రమంలో తెలుగు రాష్ట్రాలపైనా దృష్టి పెట్టింది. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ప్రతి ఎన్నికనూ ప్రతిష్టాత్మంగా తీసుకుంటోంది. ఇతర పార్టీలోని బలమైన నాయకులు చేర్చుకునేందుకు ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహిస్తూ అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ యే అన్న సంకేతాలు ఇస్తొంది.
బీజేపీ: ఫస్ట్ స్టెప్ గా నలుగురు రాజ్యసభ సభ్యులు
ఇక ఏపి విషయానికి వస్తే తెలుగు దేశం పార్టీని దెబ్బతీస్తే ఆ ఓటు బ్యాంక్ బీజేపీకి మళ్లుతుందనీ, తద్వారా రాష్ట్రంలో సెకండ్ ప్లేస్ (రెండవ స్థానం) ఆక్రమించుకోవచ్చని భావించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను విలీనం చేసుకోవడం ద్వారా ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. ఆ తర్వాత పెద్ద ఎత్తున బీజేపీలోకి టీడీపీ నుండి చేరికలు ఉంటాయని భావించారు. కానీ కొందరు టీడీపీ నేతలు మాత్రమే బీజేపీలో చేరారు. ఈ మూడేళ్లలో టీడీపీ చాలా బలహీనమవుతుందని బీజేపీ పెద్దలు అనుకున్నారు. కానీ అలా జరగలేదు. దీంతో రాబోయే ఎన్నికల్లోనూ టీడీపీకి అధికారం దగ్గకుండా చేస్తే ఆ పార్టీలోని నేతల్లో చాలా మంది గత్యంతరం లేక బీజేపీ పంచన చేరే పరిస్థితులు వస్తాయి. తద్వారా రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే ఆలోచన బీజేపీ చేస్తున్నదని వార్తలు వినబడుతున్నాయి.
బీజేపీ: జనసేన చేజారకుండా చేస్తే..
అందుకే తమతో పొత్తులో ఉన్న జనసేనతోనే ఎన్నికల్లోకి వెళతామని బీజేపీ నేతలు ఖరాఖండిగా చెబుతున్నారు. మరో సారి బీజేపీతో జత కట్టేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు స్నేహహస్తం అందిస్తున్నా బీజేపీ ససేమిరా అంటోంది. ఆ పార్టీ నేతలు పలువురు బహిరంగంగానే మరో సారి టీడీపీని నమ్మే పరిస్థితి లేదనీ, టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తిలేదని ప్రకటించారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నా కేంద్రంలోని బీజేపీకి అనధికార మిత్ర పక్షంగానే వ్యవహరిస్తొంది. అటు తమిళనాడులో స్టాలిన్, ఇటు తెలంగాణలో కేసిఆర్, పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ మాదిరిగా కేంద్రంతో కాలు దువ్వడం లేదు. వ్యతిరేకంగా వ్యవహరించడం లేదు.
రీసెంట్ గా విశాఖకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విచ్చేసిన సందర్భంలో సొంత పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కంటే మిన్నగా వైసీపీ గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. సో..40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు మరో సారి అవకాశం ఇస్తే మళ్లీ జాతీయ స్థాయి రాజకీయాలు అంటూ ఏకు మేకయ్యే ప్రమాదం ఉందని భావించే టీడీపీతో గ్యాప్ అంతే కొనసాగిస్తొందన్న వాదన లేకపోలేదు. అందుకే కాబోలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోడ్ మ్యాప్ ఇవ్వాలని కోరినా బీజేపీ పెద్దలు ఇంత వరకూ సానుకూలంగా స్పందించలేదు. రాబోయే రోజుల్లో ఏపిలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో వేచి చూడాలి.
G20 Summit: జీ 20 సమ్మిట్ కు భారత్ ప్రధాని నరేంద్ర మోడీ పయనం
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?