BJP :భారతీయ జనతా పార్టీ ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్. ఆ పార్టీ ఏపీలో బలపడాలని ఎంతో ప్రయత్నిస్తోంది. అదే సమయంలో పలు నిర్ణయాలు ఆ పార్టీకి వ్యతిరేకంగా మారాయి. ఇలాంటి సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కుటుంబ రాజకీయాలకు స్వస్తి పలకాల్సిన అవసరం ఉందని సోము వీర్రాజు అన్నారు. ఒక్క బీజేపీ ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా ఏపీలో మందు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మద్యం ధరలు రెట్టింపు చేసి ఆదాయం సమకూర్చుకుంటున్న ప్రభుత్వం, మందుబాబులకు మాత్రం నాసిరకమైన మద్యం అందిస్తున్నారని దుయ్యబట్టారు. రాజకీయాలపై ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారని సోము వీర్రాజు ఆందోళన వ్యక్తం చేశారు.
BJP ఆందోళనలో వీర్రాజు
రాజకీయాలు వ్యాపారంగా మార్చడం వల్ల ప్రజల విశ్వాసం సన్నగిల్లుతుందని సోము వీర్రాజు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అధికారులను బెదిరింపులకు గురిచేస్తూ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో జరిగే కార్యక్రమాలు తప్ప, ఎలాంటి అభివృద్ధి రాష్ట్రంలో జరగడం లేదన్నారు. కేంద్ర నిధులు లేకుండా జరిగిన అభివృద్ధి ఏమైనా ఉంటే చెప్పాలని వీర్రాజు నిలదీశారు.
జగన్ పై సంచలన వ్యాఖ్యలు
ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచితం పేరుతో కొంతమేర సహాయం చేస్తూ, ప్రజల నుంచి అంతకు రెండింతలు వసూలు చేస్తున్నారని వీర్రాజు దుయ్యబట్టారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకటిన్నర లక్షల కోట్ల అప్పు చేస్తే, ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ రెండు లక్షల కోట్ల పైనే అప్పులు చేస్తూ ప్రజలపై ఆ భారం మోపుతున్నారని చెప్పారు.