BJP Vs YCP: “అలూ లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం” అన్న సామెత అందరికీ తెలుసు. ప్రస్తుతం రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి సర్కార్ అంటే చాలా స్ట్రాంగ్ గా 151 మందికిపైగా ఎమ్మెల్యేల బలంతో ఉంది. మరో రెండున్నరేళ్ల వరకూ ఢోకాలేదు, ఎన్నికలూ లేవు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీయే హవా చూపింది. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లోనూ వైసీపీ విజయ దుంధుబి మోగించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి రంగంలోకి తీసుకువచ్చినా బీజేపీ పాచికలు పారలేదు. అయితే సోము వీర్రాజు బీజేపీ అధ్యక్షుడుగా నియమితులైన తరువాత ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, ట్వీట్ లు కొన్ని హస్యాస్పదంగా, విడ్డూరంగా ఉంటున్నాయని ఆ పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. అనాలోచితంగా మాట్లాడేయడం, ఆ తరువాత తూచ్ నేనలా అనలేదు, మీడియా వక్రీకరించింది అని ఇతర రాజకీయ పార్టీ నాయకుల మాదిరిగానే స్టేట్మెంట్ లు ఇస్తుంటారు.
గతంలో ఒక సారి రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అని కామెంట్ చేసి నాలుక కరుచుకున్న సోము వీర్రాజు తరువాత బీజేపీ, జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థి పవన్ కల్యాణ్ అంటూ ప్రకటించారు. తిరుపతి ఉప ఎన్నికల సమయంలో జనసేన అభిమానుల ఓట్ల కోసం పవన్ కళ్యాణ్ కాబోయే సీఎం అంటూ సోము వీర్రాజు ప్రకటించారు. పార్టీ నిర్ణయం ప్రకారం ఆయన ప్రకటించవచ్చు, దానికి తప్పేమీ లేదు. కానీ ఇప్పుడు టీటీడీ విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన కోర్టు తీర్పును పురస్కరించుకుని సోము వీర్రాజు చేసిన ట్వీట్ హాస్యాస్పదంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు. కోర్టు తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినంత మాత్రాన ప్రజామద్దతుతో ఏర్పడిన ప్రభుత్వాలు కూలిపోయే పరిస్థితి ఉండదు అనేది అందరికీ తెలిసిందే.
ఇంతకూ సోము వీర్రాజు ఏమని ట్వీటారంటే…“ఇటీవలే హిందూ ధార్మిక విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రాజకీయ పునరావస జంబో టీటీడీ బోర్డు జివోను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ గౌరవ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం సంతోషకరం. వైఎస్ జగన్ గారు అధికారం చేపట్టినప్పటి నుండి పదుల సంఖ్యలో ఈ వైఆర్ఆర్ సీపీ ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబడుతూ, వాటిని నిలుపుదల చేస్తూ గౌరవ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బహుశా దేశంలోనే ఇలాంటి అనుభవం మరే ఇతర ప్రభుత్వాలకు ఎదురై ఉండకపోవచ్చు. ఎన్ని సార్లు ఇలాంటి పరాభవాలు ఎదురైనా రాష్ట్ర ప్రభుత్వం తన ఆలోచనా విధానాలను మర్చుకోకపోవడం వారి యొక్క మొండి వైఖరిని, మూర్ఖత్వాన్ని తెలియజేస్తోంది. ఇలాంటి మూర్ఖులకు ఎందుకు అవకాశం ఇచ్చామా అని రాష్ట్ర ప్రజలు తలుచుకొని రోజులు లేవు. రెండు కుటుంబ, కుల, అవినీతి పార్టీలకు ప్రత్యామ్నాయంగా, త్వరలోనే రాష్ట్రంలో బీజేపీ – జనసేన కూటమికి ప్రజలు పట్టంకట్టబోతున్నారన్న సంకేతాలు స్పష్టంగా తెలుస్తున్నాయి” అని సోము వీర్రాజు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న నేత ఇలా కుటుంబ, కుల రాజకీయాల గురించి మాట్లాడటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వైసీపీలోనూ కమ్మ నాయకులు ఉన్నారు. టీడీపీలోనూ రెడ్డి నాయకులు ఉన్నారు. ఒక సామాజిక వర్గం మొత్తంగా ఒకే పార్టీలో ఉండటం ఎక్కడా ఉండదు అన్నది అందరికీ తెలిసిందే. బీజేపీలోనూ కమ్మ, రెడ్డి నాయకులు ఉన్న విషయం తెలిసిందే. జాతీయ పార్టీకి రాష్ట్ర నాయకుడుగా ఉన్న సోము వీర్రాజు ఈ విధంగా ట్వీట్ చేయడం హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు. ఎన్నికల సమయంలో తమ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటే లేదు తమ పార్టీ అధికారంలోకి వస్తుంది అని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేసుకోవడం చూస్తుంటాం, కానీ రెండున్నరేళ్ల వరకూ ప్రభుత్వానికి ఏటువంటి ఢోకాలేని ఈ పరిస్థితిలో త్వరలో బీజేపీ – జనసేన కూటమికి ప్రజలు పట్టంకట్టబోతున్నారన్న సంకేతాలు స్పష్టంగా తెలుస్తున్నాయని అనడం విడ్డూరం కాకపోతే ఏమిటని అంటున్నారు. ఏపిలో మతం కార్డు వాడటం వల్ల ప్రయోజనం లేదని భావించిన బీజేపీ.. కులం కార్డుతో ముందుకు వెళుతుందని, అందుకే సోము వీర్రాజు కుటుంబ, కుల రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని పేర్కొంటున్నారు.
Read More: AP High court: ఏపి సర్కార్కు హైకోర్టు మరో షాక్..! టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై స్టే..!!
ఇటీవలే హిందూ ధార్మిక విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రాజకీయ పునరావాస జంబో టీటీడీ బోర్డు జీఓ ను తాత్కాలిక నిలుపుదల చేస్తూ గౌరవ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం సంతోషకరం.@ysjagan గారు అధికారం చేపట్టినప్పటి నుండి పదుల సంఖ్యలో ఈ @YSRCParty ప్రభుత్వ (1/2) pic.twitter.com/vrCxnayP9F
— Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) September 22, 2021