YSRCP: విజయనగరం జిల్లాలో వైసీపీ ఓ సాహసం చేస్తోంది. మహారాజు పూసపాటి వంశీయుడైన అశోక్ గజపతిరాజును ఏదో విధంగా అవినీతి ముద్ర వేసి జైలుకు పంపించాలని కంకణం కట్టుకుంది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాటలు, ట్వీట్ లు, దానికి తగినట్లుగా ఉన్నాయి. ప్రభుత్వ చర్యలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. మాన్సాస్, సింహచలం ఆలయ భూములకు సంబంధించి ఇటీవలే ప్రభుత్వం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే వివాద రహితుడుగా పేరున్న అశోక్ గజపతిరాజును వైసీపీ టార్గెట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఏ మాత్రం తేడా వచ్చినా 2024 ఎన్నికల్లో దాని ప్రభావం కనబడుతుంది. 2019 ఎన్నికల్లో విజయనగరం జిల్లలో స్వీప్ చేసిన వైసీపీకి సీన్ రివర్స్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ పరిణామాలను గమనించిన వైసీపీ ఓ పక్క పార్టీకి నష్టం జరగకుండా మరో పక్క అశోక్ గజపతిరాజును దెబ్బతీయడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో గత రెండున్నర సంవత్సరాలుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న బొబ్బిలి రాజులు తిరిగి వైసీపీ గూటికి చేర్చుకోవాలని ప్రయత్నిస్తుందని వార్తలు వస్తున్నాయి. గతంలో వైసీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన సుజయ కృష్ణ రంగారావు టీడీపీలో చేరిపోవడానికి కూడా బొత్సా రాజకీయ ఆధిపత్యమే కారణం తప్ప జగన్ కాదని వారు అనుకుంటున్నారు. వైసీపీలో బొత్సా ఆధిపత్యానికి చెక్ పెడితే బొబ్బిలి రాజు కుటుంబ బ్రదర్స్ వైసీపీలో తిరిగి చేరడానికి సముఖంగా ఉన్నట్లు సమాచారం. ఇటు బొబ్బలి రాజులకు అటు పూసలపాటి వారితో చారిత్రక వైరం కూడా ఉంది. అశోక్ గజపతిరాజు మాదిరిగానే సుజయ క్రిష్ణ రంగారావు కుటుంబానికి సొంత ఇమేజ్ ఉంది. కాకపోత 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ వేవ్ మూలంగా టీడీపీ తరపున పోటీ చేయడం వల్ల సుజయ క్రిష్ణరంగారావు పరాజయం పాలైయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత ఆయన రాజకీయంగా సైలెంట్ గా ఉన్నారు. బొత్సాను పక్కన పెడితే తిరిగి వైసీపీ లోకి రావడానికి బొబ్బిలి రాజులకు అభ్యంతరం లేదని సమాచారం.
సుజయ క్రిష్ణ రంగారావు గతంలో రెండు పర్యాయాలు కాంగ్రెస్ తరపున, ఒక పర్యాయం వైసీపీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. బొబ్బలి రాజులు వైసీపీలో ప్రాధాన్యత కల్పిస్తే బొత్సా రాజకీయ హవాకు చెక్ పెట్టినట్లు అవ్వడంతో పాటు అశోక్ గజపతిరాజుపై చర్యలు తీసుకున్నా నష్ట నివారణ సాధ్యమవుతుందన్న భావనలో వైసీపీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై రెండు మూడు నెలల్లో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.