Brahmamgari Matam: బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి నేతృత్వంలో నిన్న వివాదం పరిష్కారం అయిన్నట్లు వార్తలు వచ్చాయి. నేడు అధికారికంగా ప్రకటన చేస్తారనుకుంటున్న తరుణంలో తనను సంప్రదించలేదంటూ దివంగత పీఠాధిపతి రెండో భార్య మారుతీ మహాలక్ష్మమ్మ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. నేడు ఆమె మీడియాతో మాట్లాడారు. తనకు న్యాయం జరిగితేనే ఏకాభిప్రాయానికి వస్తాననీ పేర్కొన్నారు. తనతో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పీఠాధిపత్యం విషయంలో చర్చించలేదనీ, పెద్ద బార్య కుమారులైన వెంకటాద్రి స్వామి, వీరభద్ర స్వామి మాత్రమే ఎమ్మెల్యేతో సమావేశమయ్యారని తెలిపింది. ఎమ్మెల్యే తనతో తరువాత చర్చిస్తామని మాత్రమే తెలిపారన్నారు. కర్నాటక కరుణాకరరెడ్డి అభిప్రాయాన్ని బట్టి తమ అంగీకారం తెలియజేస్తామని ఆమె చెప్పారు.
కాగా పీఠాధిపతి వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర ఆజాద్ ను నియమించింది. దీంతో ఆయన నేడు మఠానికి చేరుకని వారసత్వ కుటుంబాల సభ్యులతో వేరువేరుగా సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు. దివంగత పీఠాధిపతి వెంకటేశ్వరస్వామి పెద్ద భార్య నలుగురు కుమారులు, రెండో భార్య మారుతీ మహాలక్ష్మమ్మ, ఆమె ఇద్దరు కుమారులతో సమావేశమైయ్యారు. గ్రామస్తులు, ధార్మిక సంఘాల అభిప్రాయాలను అధికారి సేకరించనున్నారు.
నేడో రేపో ఈ వివాదం పరిష్కారం అవుతుందని భావిస్తున్నారు. దివంగత పీఠాధిపతి రెండో భార్య మారుతీ మహాలక్ష్మమ్మ ఏకాభిప్రాయానికి వస్తే మొదటి భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రిని పీఠాధిపతిగా, రెండవ కుమారుడు వీరభద్రయ్యకు ఉత్తరాధికారి బాధ్యతలు అప్పగిస్తారు. దివంగత పీఠాదిపతి పీఠం వారసత్వానికి సంబంధించి రెండో భార్య సంతానానికి వీలునామా రాయడంతో ఆమె తమ కుమారునికి పీఠాధిపతి బాధ్యతలు అప్పగించాలని పట్టుబడుతోంది. అయితే ఆమె ఇద్దరు కుమారులు మైనర్ లు. అటు మొదటి భార్య కుమారులు, ఇటు రెండవ భార్య పీఠాధిపత్యం కొరకు పట్టుబడటంతో వివాదం పరిష్కారం కావడం లేదు.