Brahmamgari Matham: పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం పీఠాధిపత్యం వ్యవహారం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. పీఠాధిపతి వెంకటేశ్వరస్వామి మరణం తరువాత కుటుంబ పంచాయతీ.. స్వామిజీల బృందం, దేవాదాయ శాఖ అధికారుల మద్యవర్తిత్వ పరిష్కారాలు ఉత్కంఠను రేపాయి. దేవాదాయ శాఖ అధికారులు, గ్రామ పెద్దల సమక్షంలో ఇరువర్గాలు ఏకాభిప్రాయానికి వచ్చి దివంగత పీఠాధిపతి మొదటి భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామిని ఎంపిక చేయడం జరిగిందనీ ప్రకటించిన మరుసటి రోజే పీఠాధిపతి రెండవ భార్య మారుతీ మహాలక్ష్మి హైకోర్టును ఆశ్రయించి ట్విస్ట్ ఇచ్చింది.
దీంతో వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. తనను బలవంత పెట్టి సంతకం చేయించారని ఆమె కోర్టుకు విన్నవించింది. దీంతో హైకోర్టు నిబంధనలు పాటించాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వివాదంలో ఒకరు ముందుకు లాగుతుంటే మరొరకు వెనక్కి లాగుతున్నారు. మద్యవర్తుల మాట కూడా వినకపోవడంతో ఈ వ్యవహారం ఎప్పుడు పరిష్కారం అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ మఠం వ్యవహారంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మఠం పీఠాధిపతి వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో మారుతీ మహాలక్ష్మిని మఠంలోకి ప్రవేశించకుండా చూడాలంటూ కందిమల్లయ్య పల్లె గ్రామస్తులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడం తీవ్ర సంచనం అయ్యింది.
మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో సామరస్య పూర్వక పరిష్కారం చేసినప్పటికీ మఠం ప్రతిష్ఠ ను దెబ్బతీసేలా మారుతీ మహాలక్ష్మి న్యాయస్థానంను ఆశ్రయించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో మఠంలోకి వెళ్లేందుకు తనకు భధ్రత కల్పించాలంటూ మారుతి మహాలక్ష్మి పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించారు. ఇదిలా ఉండగా వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం ప్రతిష్టను దెబ్బతీసిన మారుతి మహాలక్ష్మి మఠంలోకి ప్రవేశిస్తే సమస్యలు ఉత్పన్నం అవుతాయని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. మాఠాధిపతి నియామకం పూర్తి అయ్యే వరకూ కందిమల్లాయపల్లె పుర సంస్థానం (మహా నివేదిన మందిరం) లోకి మారుతీ మహాలక్ష్మి వెళ్లేందుకు అనుమతిని నిరాకరించాలని గ్రామస్తులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ వివాదం నేపథ్యంలో పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.