Breaking: ఏపి ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పీఆర్సీ జీవోలను వెనక్కు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. కొత్త పీఆర్సీ ఉత్తర్వులను ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పిన ఉద్యోగ సంఘాల నేతలు భవిష్యత్తు ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమైయ్యారు. రేపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మకు సమ్మె నోటీసు కూడా ఇవ్వనున్నారు. ఉద్యోగ సంఘాలు ఈ మాదిరిగా వ్యతిరేకిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం కూడా వెనక్కు తగ్గేది లే అన్నట్లుగా కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాల చెల్లింపునకు కార్యచరణ సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ట్రెజరీ (ఖజానా) కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. సవరించిన పే స్కేల్ ఆధారంగా జీతాల్లో మార్పులు చేయాలని స్పష్టం చేసింది. ఇదే క్రమంలో కొత్త పీఆర్సీ ప్రకారం జీతాల చెల్లింపునకు ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను సీఎఫ్ఎంఎస్ సిద్ధం చేసింది.
Breaking: రేపు సీఎస్ కు సమ్మె నోటీసు అందజేయనున్న ఉద్యోగ సంఘాల నేతలు
నూతన పీఆర్సీ ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని ఇప్పటికే ఉద్యోగులు ఆందోళన ఉదృతం చేశారు. నల్ల బ్యాడ్జీలతో విధులకు హజరవుతున్న ఉద్యోగులు చివరి ఆస్త్రంగా సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు. నిబంధనల ప్రకారం సమ్మె నోటీసు 14 రోజులు ముందుగా ఇవ్వాల్సి ఉన్నందున శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను కలిసి నోటీసు ఇవ్వనున్నారు. ఈ మేరకు ఏపి జేఏసీ, జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించే సమావేశంలో ఉద్యమ కార్యాచరణ ను ప్రకటించనున్నాయి. మరో పక్క నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య పిలుపు మేరకు ఉపాధ్యాయులు జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.