Breaking : రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో ఎన్నికల సందడి నెలకొంది. ఇప్పటికే ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక జరగనున్నది. ఇప్పుడు తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ, ఏపిలో ఖాళీ అవ్వనున్న ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యుల్ విడుదల చేసింది.
ఏపిలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 14న జరగనున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 16వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ నెల 23వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణ, 24 నామినేషన్ల స్క్రూటినీ, నామినేషన్ల ఉపసంహరణ గడువు 26వ తేదీ. మార్చి 14వ తేదీన ఉదయం 8గంటల నుండి సాయంత్రం 4గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. మార్చి 17వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు.
ఏపిలో ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న రాము సూర్యారావు (ఆర్ఎస్ఆర్ మాస్టర్), కృష్ణా – గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ ల పదవీ కాలం మార్చి 29వ తేదీన ముగియనున్నది. అదే విధంగా తెలంగాణలో మహబూబ్నగర్ – రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు, వరంగల్లు – ఖమ్మం – నల్లగొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి ల పదవీ కాలం మార్చి 29వ తేదీన ముగియనున్నది. ఖాళీ అవుతున్న ఈ ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేష్ విడుదల చేసింది.