Breaking : కర్నూలు జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి చెందగా మరో నలుగురు గాయపడ్డారు. హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారిపై వెల్దుర్తి మండలం మాదాపురం వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లా మదనపల్లెకి చెందిన ఒకే కుటుంబం రాజస్థాన్ లోని అజ్మీరు దర్గాకు టెంపోలో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న టెంపో వాహనం అదుపుతప్పి డివైడర్ ను దాటి ఎదురుగా వస్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో 8మంది మహిళలు, అయిదుగురు పురుషులు, ఒక బాలుడు ఉన్నారు మరో నలుగురు చిన్నారులు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో టెంపోలో 18 మంది ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పెద్ద ఎత్తున కాపాడండీ అంటూ కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన యాస్మిన్, కాశిం, ముస్తాక్, అస్మాలను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. వీరిలో ఇద్దరు పిల్లలు అపస్మారక స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం కారణంగా టెంపో వాహనం నుజ్జునుజ్జు అవ్వడంతో మృతదేహాలు అన్నీ అందులో ఇరుక్కున్నాయి. పోలీసులు క్రేన్ సహాయంతో టెంపో నుండి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాల వద్ద లభించిన ఆధార్ కార్డులు, పోన్ నెంబర్ల అధారంగా పోలీసులు వివరాలను సేకరించారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్ తప్పులేదని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?