Breaking : అరకు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ వాసుల విహార యాత్ర విషాదంగా మారింది. హైదరాబాదుకు చెందిన కొందరు అరకు విహార యాత్రకు ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో బయలుదేరి వెళ్లారు. వీరు ప్రయాణిస్తున్న బస్సు అనంతగిరి మండలం డముక సమీపంలోని ఘాట్ రోడ్డులో అయిదవ నెంబరు మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో విజయనగరం ఎస్ కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన సమాచారం తెలియడంతో పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 25 మంది ఉన్నట్లు తెలుస్తోంది. మృతులంతా హైదరాబాదు షేక్ పేటకు చెందిన వారుగా గుర్తించారు. ప్రమాద వివరాల కోసం అధికారులు కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. వివరాలకు 08912590102,08912590100 నంబర్ లకు సంప్రదించాలని తెలిపారు.